గండిపేట, వెలుగు: విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) సర్వీస్లు అందించే జీఎంఆర్ ఏరో టెక్నిక్, డిఫెన్స్ కంపెనీ హనీవెల్ ఏరోస్పేస్తో కీలక లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హనీవెల్ టెక్నాలజీతో పనిచేసే కీలక పరికరాలను భారతదేశంలో మరమ్మతు (ఎంఆర్ఓ) చేయడానికి అనుమతి పొందింది.
ఈ డిఫెన్స్ కంపెనీ ఆమోదం లేకుండా ఏ సంస్థా ఈ పరికరాలను తాకడానికి వీల్లేదు. లీప్ ఇంజిన్లలో ఉపయోగించే ఏడు లైన్ రీప్లేసబుల్ యూనిట్స్ ఎంఆర్ఓ సేవలను జీఎంఆర్ అందించనుంది. ఎయిర్బస్ ఏ320నియో, బోయింగ్ 737 ఎం మాక్స్ విమానాల్లో ఈ ఇంజిన్లను వాడుతున్నారు.
వీటిలో కీలక పార్టులను పూర్తిగా విడదీయడం, తనిఖీ, మరమ్మత్తు, తిరిగి అమర్చడం, పనితీరు పరీక్షలు నిర్వహించడం వంటి ప్రక్రియలను జీఎంఆర్ చేస్తుంది. ఈ ఇంజిన్లలో వాడే కీలక విడిభాగాలను హనీవెల్ తయారు చేస్తోంది.
