హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్ రంగం కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 95ను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ స్వాగతించింది. భవన నిర్మాణ నిబంధనల్లో చేసిన మార్పులతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఈజీగా నెరవేరుతుందని నారెడ్కో ప్రతినిధులు తెలిపారు.
టీడీఆర్ వినియోగంలో తీసుకొచ్చిన మార్పులు నగరాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన వారికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) ద్వారా తగిన పరిహారం లభిస్తుందని పేర్కొన్నారు. 750 నుంచి 2,000 చదరపు మీటర్ల స్థలాల్లో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో ఈ ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ సాయి తెలిపారు.
