గోదా ‘వర్రీ’.. తగ్గుతున్న వరద ఉధృతి

గోదా ‘వర్రీ’.. తగ్గుతున్న వరద ఉధృతి

భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే.. గోదావరి వరద కాస్త తగ్గుతోంది. గంటగంటకూ వరద ఉధృతి తగ్గుతుండటంతో.. ప్రస్తుతం 71.90 అడుగులకు చేరింది. వరద బాధితుల కోసం జిల్లాకు 10 ఎన్డీఆర్ఎఫ్, 5 ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్ ను తరలించారు. 95 ముంపు బాధిత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 77 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20 వేల 922 మందిని.. సెంటర్లకు తరలించారు. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. వరద కంటిన్యూ అవుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్ పై  రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలన్నారు. లైఫ్ జాకెట్లతో పాటు ఇతర రక్షణ సామాగ్రిని భద్రాచలంకు అదనంగా తరలించాలన్నారు సీఎం కేసీఆర్.