
శంభాజీనగర్: భార్యకు మంగళసూత్రం కొనివ్వాలన్న 93 ఏండ్ల పెద్దాయన ప్రేమను చూసి బంగారం షాపు యజమాని ఫిదా అయ్యాడు. రూ.1,120 ఇచ్చి తన భార్యకు మంగళసూత్రం కావాలని అడిగిన ఆ వృద్ధుడికి జ్యువెలరీ షాప్ ఓనర్.. రూ.20 మాత్రమే తీస్కుని బంగారు నగను అందజేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే(93), ఆయన భార్య శాంతాబాయి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా వాళ్ల గ్రామం నుంచి పండరీపురానికి పాద యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాంతాబాయికి మంగళసూత్రం కొనాలనుకుని శంభాజీనగర్లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. ఆ వృద్ధ దంపతులను చూసి జ్యువెలరీ షాపు సిబ్బంది పొరబడ్డారు. డబ్బు సాయం కోసం వచ్చారేమోనని అనుకున్నారు.
కానీ, తన భార్యకు మంగళసూత్రం కొనాల్సి ఉందని షిండే చెప్పడంతో లోపలికి పంపించారు. అక్కడ షాపు ఓనర్ చేతిలో 1,120 రూపాయలు పెట్టి తన భార్యకు మంగళసూత్రం కావాలని షిండే అడిగాడు. ఆ పెద్దాయనకు భార్యపై ఉన్న ప్రేమను, వారి మధ్య అనుబంధాన్ని చూసి షాపు యజమాని కరిగిపోయారు. వాళ్లనుంచి రూ.20 మాత్రమే తీస్కుని మంగళసూత్రాన్ని బహుమతిగా ఇచ్చారు.