
పోలీసులకు బంధువుల కంప్లయింట్
రెండు నెలల్లో 5 కేసులు నమోదు
గచ్చిబౌలి,వెలుగు: టిమ్స్ హాస్పిటల్లో కరోనాతో చనిపోయిన డెడ్ బాడీలపై ఉండాల్సిన బంగారం మాయమవుతోంది. టిమ్స్లో ట్రీట్ మెంట్ తీసుంటూ చనిపోయిన తర్వాత హాస్పిటల్ అధికారులు, సిబ్బంది డెడ్ బాడీలను వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఆ టైమ్లో డెడ్ బాడీలపై ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. డెడ్ బాడీలపై బంగారం మాయమైందని ఏప్రిల్లో 3, ఈ నెలలో 2 కంప్లయింట్లు వచ్చినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, హౌస్ కీపింగ్ స్టాఫ్, పేషెంట్ కేర్ టేకర్లను విచారిస్తున్నామన్నారు. టిమ్స్ లో అడ్మిట్ అయ్యే పేషెంట్ల దగ్గరున్న బంగారాన్ని కుటుంబసభ్యులు ముందుగానే తీసేసి వారి దగ్గర ఉంచుకోవాలని సూచిస్తూ హాస్పిటల్ ఆవరణలో బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఏప్రిల్ 17న సాయంత్రం 4.20 గంటలకు టిమ్స్ హాస్పిటల్లోని ఐదో ఫ్లోర్లో కరోనా పేషెంట్ ఫర్హానా సుల్తానా చనిపోయింది.
సిబ్బంది డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. సుల్తానా గోల్డ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఏప్రిల్ 18వ సాయంత్రం 4.20 గంటలకు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ ఉమాదేవి చనిపోయింది. ఆమె గోల్డ్ ఇయర్ రింగ్స్, బంగారు పుస్తెల తాడు మిస్సింగ్ కావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12.30 గంటలకు హాస్పిటల్ నాలుగో ఫ్లోర్ ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాములమ్మ మృతిచెందింది. ఆమె వద్ద ఉండాల్సిన 10 గ్రాముల గొలుసు, బంగారు ముక్కు పుడక కనిపించలేదు.