నారాయణగూడ, వెలుగు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.30 లక్షలు తీసుకున్న ఘటనలో పాతబస్తీకి చెందిన పల్లపు సురేశ్కుమార్ అలియాస్ ‘గోల్డ్ మెన్’ సూర్యభాయ్పై కేసు నమోదైంది. అత్తాపూర్ పోలీసుల నుంచి నారాయణగూడ పోలీసులకు కేసు బదిలీ అయింది. దీంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 10న కృష్ణమాచారి, మరో ఇద్దరు వ్యక్తులు సూర్యభాయ్ ను హిమాయత్నగర్లోని ఓ హోటల్లో కలిశారు.
ఈ సందర్భంగా తనకు బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నాయని, మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం ఇప్పించగలనని సూర్యభాయ్ వారిని నమ్మించాడు. మార్కెట్లో కిలో బంగారం ధర సుమారు రూ.1.5 కోట్లు ఉండగా, కేవలం రూ.కోటికే విదేశాల నుంచి కిలో బంగారం తెప్పించి ఇస్తానని చెప్పాడు.
అతని మాటలు నమ్మిన బాధితులు పలు దఫాల్లో మొత్తం రూ.30 లక్షలు చెల్లించారు. లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని నారాయణగూడ ఇన్స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు సూర్యభాయ్ను విచారించలేదని, అతనిని విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
