న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన 9వ తరగతి సామాజిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీ)ను ప్రశంసిస్తూ పొందుపరిచిన అంశాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘అండర్స్టాడింగ్సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ పేరుతో రూపొందించిన పుస్తకంలో ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పేర్కొంటూ, దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని వివరించారు. అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడడం, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతలని పుస్తకంలో పేర్కొన్నారు. ఓటరు జాబితాల్లోని మరణించిన వారి పేర్లు, నకిలీల వివరాలను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చేందుకు చేపట్టిన ‘సర్’ ప్రక్రియను కూడా ఇందులో సమర్థించారు. కాగా, ఇటీవల ఈ పాఠ్యపుస్తకంలో ‘ద ఎమర్జెన్సీ’పై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడం కూడా వివాదాస్పదమైంది.
