కొన్ని సెకన్లలో బిల్డింగ్ నేలమట్టం... భారీ వర్షానికి దెబ్బతిన్న గవర్నమెంట్ బిల్డింగ్..

కొన్ని సెకన్లలో బిల్డింగ్ నేలమట్టం... భారీ వర్షానికి దెబ్బతిన్న గవర్నమెంట్ బిల్డింగ్..

కోహిమాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాగాలాండ్ లో దెబ్బతిన్న ప్రభుత్వ భవనాన్ని కూల్చేశారు అధికారులు. కొన్ని సెకన్లలోనే భవనం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నాగాలాండ్‌ లోని టుయెన్‌సాంగ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న జిల్లా రవాణా ఆఫీసు బిల్డింగ్ గురువారం ( ఆగస్టు 27 ) కూల్చేశారు అధికారులు. ఆ బిల్డింగ్ సురక్షితమైంది కాదని గతంలోనే ప్రకటించారు అధికారులు.

జులై 23, 2026న ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతిన్నదని,  ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు అధికారులు.దీంతో ప్రభుత్వం ఆ బిల్డింగ్ కూల్చివేతకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ ను సిబ్బంది ఖాళీ చేసి రిజిస్ట్రేషన్ సేవల్ని నిలిపేశారు.

కంటిన్యూగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం కారణంగా టుయెన్ సాంగ్ జిల్లాపై తీవ్ర ప్రభావం పడటంతో 49 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.వీరిలో డిటిఓ పరిధిలోని 44 కుటుంబాలు, పోస్ట్ ఆఫీస్ వార్డ్, బజార్ ఎ వార్డ్‌కు చెందిన ఐదు కుటుంబాలు ఉన్నాయి. డిటిఓ ప్రాంతం సమీపంలో భూమి రోజుకు ఆరు నుండి ఎనిమిది అంగుళాల చొప్పున కుంగిపోతూనే ఉందని తెలిపారు అధికారులు.

అప్రమత్తమైన అధికారులు డీటీవో బిల్డింగ్ ను ముందుగానే ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా నిషేధం విధించారు అధికారులు.టుయెన్‌సాంగ్ టౌన్ హాల్ దగ్గర సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులైన కుటుంబాలకు అత్యవసర సహాయాన్ని అందించారు అధికారులు.