ఆలేరును సస్యశ్యామలం చేసినం : గొంగిడి సునీత

ఆలేరును సస్యశ్యామలం చేసినం : గొంగిడి సునీత
  • బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు : గత పాలనలో కరువు కాటకాలతో తల్లడిల్లిన ఆలేరును గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశామని  బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత చెప్పారు.  బుధవారం యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్ తండా, రాళ్లజనగాం, జంగంపల్లి, మైలారుగడ్డతండా, మల్లాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  కరువు కారణంగా పట్నం వలసపోయిన రైతన్నలు తిరిగి ఊరికొచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించామని చెప్పారు.  24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మే స్థితిలో ఆలేరు ప్రజలు లేరని,  హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, నేతలు వంటేరు సురేష్ రెడ్డి,  కసావు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు శంకర్ నాయక్, శ్రీశైలం, పుల్లయ్య, సరిత, బీరయ్య, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ లో చేరిన సీపీఐ కౌన్సిలర్

యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ దండెబోయిన అనిల్.. బుధవారం సీపీఐకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 300 మంది అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన ఆయనకు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. లాగే గుండాల మండలం మాసాన్ పల్లి, తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి, ఆత్మకూర్ మండలం లింగరాజుపల్లి, బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, బొమ్మలరామారం టౌన్ నుండి 500 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు  బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.