
నల్గొండ: పేదల సొంతింటి కలకు అడుగులు పడుతున్నాయి. జనవరి 26, 2025 నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం చేపడుతున్నారు.
నల్గొండ జిల్లాలో ఈ ఇందిరమ్మ నమూన ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ ఇందిరమ్మ నమూన ఇల్లు పేదల సొంతింటి కలను సాకారం చేసే విధంగా ఉండటం విశేషం. ఇందిరమ్మ ఇంటిని 45 గజాల్లో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, ఒక హాల్, కిచెన్ ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్ చేశారు.
నల్గొండ జిల్లాలో నమూనా ‘ఇందిరమ్మ ఇల్లు’.. ఎలా ఉందో చూసేయండి..#Nalgonda #IndirammaHousingScheme #Indirammademohouse #CMRevanthreddy pic.twitter.com/vx4UJRWf5g
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) March 8, 2025
ఇంటికి రెండు వైపులా రెండు దర్వాజాలు, వెంటిలేషన్ ఎక్కువగా రావడానికి హాల్లో రెండు కిటికీలు, కిచెన్లో ఒకటి, బెడ్రూమ్లో ఒక కిటికీని అమర్చారు. కిచెన్లో సింక్ విత్ పైప్లైన్ ఏర్పాటు చేశారు. వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా.. దాని ద్వారా కిచెన్, బాత్రూమ్కు కనెక్షన్ ఇచ్చారు. ఇదే తరహాలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. 45 గజాలకు కాకుండా 70 గజాల నుంచి 75 గజాల స్థలం ఉంటే లబ్ధిదారులు కాంపౌండ్ వాల్ నిర్మించుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేదని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్నగర్ నిమోజకవర్గంలోని మహబూబ్నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల వీరయ్య తన సొంత జాగలో ఇంటిని నిర్మించుకున్నాడు. దీనిని డెమోగా చూయిస్తూ.. ఈ నిర్మాణం ప్రకారం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. ఇలా తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం దాదాపు పూర్తయింది.