- బ్యాంకులతో ఎన్పీసీఐ సంప్రదింపులు
- ఇది వరకే కొన్ని ఏటీఎంలలో డిపాజిట్ సదుపాయం
ముంబై:
ఇది వరకే బ్యాంకుల మధ్య నగదు బదిలీ కోసం యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కస్టమర్ల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. ఏటీఎంల ద్వారా డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని కూడా అందించాలని ఈ బ్యాంకులను కోరుతోంది. బ్రాంచ్ల నుంచి కూడా ఇతర బ్యాంకుల ఖాతాలకూ డబ్బు పంపడాన్ని అనుమతించాలని సూచించింది. ఈ కొత్త డిపాజిట్ విధానాన్ని తమ నేషనల్ ఫైనాన్స్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్) ద్వారా సాధ్యం చేయవచ్చని ఎన్సీపీఐ చెబుతోంది. ఈ విధానాన్ని ఎన్సీపీఐకి చెందిన ఐడీఆర్బీటీ తయారు చేసింది. ఏటీఎం క్యాష్ డిపాజిట్, బ్రాంచ్ డిపాజిట్ విధానం అందుబాటులోకి వస్తే నగదు సరఫరాకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఏటీఎం ఆపరేటర్లు తరచూ మెషీన్లలో నగదు నింపాల్సిన అవసరం ఉండదు. ఏటీఎంలో కస్టమర్లు చేసే డిపాజిట్లే తిరిగి ఏటీఎం విత్డ్రాయల్స్గా మారుతాయి కాబట్టి ఆపరేటర్ల ఖర్చులు ఆదా అవుతాయి. ఏటీఎం క్యాష్ డిపాజిట్ నెట్వర్క్లో చేరాల్సిందిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను కోరామని, అయితే ఏటీఎం ద్వారా నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఎన్సీపీఐ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. బ్యాంకుల నెట్వర్కులను కలిపేందుకు శ్రమించాల్సి ఉంటుందన్నారు. మనదేశంలో ఇప్పటికే 14 బ్యాంకులు ఏటీఎం క్యాష్ డిపాజిట్ నెట్వర్క్ను అమలు చేస్తున్నాయి. ఎన్ఎఫ్ఎస్ ద్వారా పెద్ద బ్యాంకులకు చెందిన 30 వేల ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని అమలు చేయవచ్చని ఎపీసీఐ అంచనా వేసింది. ఇలా చేయడానికి హార్డ్వేర్ను కూడా మార్చాల్సిన అవసరం లేదని ఐటీ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
కస్టమర్లకు ఎంతో మేలు
ఏటీఎం క్యాష్ డిపాజిట్స్, బ్రాంచ్ డిపాజిట్స్పై మరింత సమాచారం కోసం ఎన్పీసీఐ స్ఫందన కోసం ప్రయత్నించినా జవాబు లేదు. అయితే ఈ విధానాలు అమలైతే బ్యాంకు కస్టమర్లకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బును డిపాజిట్ చేయొచ్చు. ఆఫ్సైట్ లొకేషన్లలోనూ డబ్బు డిపాజిట్ చేయవచ్చు. వీటిని క్యాష్ డిపాజిట్ మెషీన్లు అంటారు. కస్టమర్లేగాక ఈ–కామర్స్ డెలివరీ ఏజెంట్లకు, ఫుడ్ అగ్రిగేటర్ల డెలివరీ ఏజెంట్లకు మేలు కలుగుతుంది. వాళ్లు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును దగ్గర్లోని ఏటీఎంలోనే డిపాజిట్ చేయొచ్చు కాబట్టి నగదు ఆఫీసు దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటింగ్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకులు ఏటీఎం క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానంలో రూ.10 వేల వరకు క్యాష్ డిపాజిట్ చేయడానికి రూ.25 చార్జ్ చేస్తారు. రూ.10 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే రూ.50 చెల్లించాలి. ఎన్సీపీఐ వల్లే యూపీఏ విధానానికి జనం అలవాటుపడ్డారని, ఏటీఎం క్యాష్ డిపాజిట్ సదుపాయం వస్తే కస్టమర్కు మరింత మేలు జరుగుతుందని ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ ఏసీఐ వరల్డ్బ్యాంక్కు చెందిన కౌశిక్ రాయ్ అన్నారు.