
Google Work From Office Policy: కరోనా కాలంలో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిని తిరిగి ఆఫీసులకు రప్పించటానికి కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. కానీ మారి వ్యాపార అవసరాలు, బిజినెస్ వాతావరణంలో అనేక కంపెనీలు కొన్ని త్రైమాసికాలుగా తమ ఉద్యోగులను మెల్లమెల్లగా తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రస్తుతం చాలా సంస్థలు కఠినంగా కూడా వ్యవహరిస్తున్నాయి.
ఇప్పుడు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ కూడా తమ ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనంటూ కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని తీసుకొచ్చింది. దీనిని కంపెనీలోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మెషన్, కమ్యూనికేషన్ టీమ్స్ కి పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో గూగుల్ సెర్చ్, కామర్స్, యార్డ్స్ వంటి డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు సైతం కొత్త పాలసీ కిందకు వస్తారని తేలింది.
కొత్త పాలసీ కింద ప్రస్తుతం ఆఫీసుకు 50 మైళ్ల దూరంలో ఉంటూ రిమోట్ వర్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్ షెడ్యూల్ కిందకు మారాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజుల పాటు తమ ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అయితే 2022లోనే హైబ్రిడ్ వర్క్ విధానం కోసం గూగుల్ తన ఉద్యోగులకు పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని ఫాలో అవ్వాలనుకోని ఉద్యోగులు వారంతటగా వారే కంపెనీని వీడేందుకు సైతం గూగుల్ అవకాశం కల్పిస్తున్నట్లు అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన మెమో చెబుతోంది. దీని కింద వెళ్లిపోవాలని తలచిన ఉద్యోగులకు సివరెన్స్ పే చెల్లించబడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ పాలసీ కంపెనీ పనితీరును మెరుగుపరిచినట్లు ఒక అధికారి వెల్లడించారు.