మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
  • రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం
  • మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్‌‌ బిశ్వభూషణ్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇప్పుడు ఏపీకి మూడు రాజధానాలు ఏర్పడనున్నాయి. దాంతో పాటు సీఆర్డీయేని రద్దు చేసే బిల్లుకు కూడా ఆమోద ముద్ర పడింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్‌ రాజధానిగా కర్నూలు ఉంటాయి. జనవరి 20న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.