
న్యూఢిల్లీ, వెలుగు: ఆదివారం వచ్చిందంటే చాలు డీ-మార్ట్ షాపింగ్కు ఎక్కువగా వెళుతుంటారు. వీకెండ్కు తోడు జూన్ 1వ తేదీ ఆదివారం రావడంతో మే 31నే చాలా మంది ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ అయ్యాయి. దీంతో.. ఇంట్లో సరుకులు తీసుకునేందుకు డీ-మార్ట్ లాంటి సూపర్ మార్కెట్లకు జనం క్యూ కట్టే ఛాన్స్ ఉంది. వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు గమనించాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.
వంట నూనెల ధరలను తగ్గించడంతో పాటు, దేశీయ రిఫైనింగ్ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. మనదేశం తన వంట నూనెల అవసరాలలో 50 శాతం పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. గత కొంతకాలంగా అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరగడంతో, దేశీయ మార్కెట్లో కూడా అవి మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రిఫైన్డ్ వంట నూనెల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. దీంతో స్థానిక రిఫైనింగ్ పరిశ్రమలకు నష్టం వస్తోంది.
ముడి వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గించడం ద్వారా, వినియోగదారులకు వంట నూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. ముడి నూనెలపై సుంకం తగ్గించి, రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని యదాతథంగా ( 35.75శాతం ) ఉంచడం వల్ల ముడి నూనెల దిగుమతులు పెరుగుతాయి. ఇది దేశీయంగా నూనెలను శుద్ధి చేసే పరిశ్రమలకు (రిఫైనరీలు) ప్రయోజనం చేకూరుస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. ముడి, శుద్ధి చేసిన నూనెల మధ్య దిగుమతి సుంకం తేడాను 8.25శాతం నుంచి 19.25శాతానికి పెంచాలని పరిశ్రమ సంస్థలు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో ఆ డిమాండ్ నెరవేరింది.
బేసిక్ కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పాటు, ఇతర ఛార్జీలను (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్) కలిపిన తర్వాత, ఈ మూడు ముడి వంట నూనెలపై సుంకం 16.5 శాతానికి తగ్గింది. పరిశ్రమ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇది దేశీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి సహాయపడుతుందని, తద్వారా వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు నూనెలు అందుబాటులోకి వస్తాయని ఎస్ఈఏ, ఐవీపీఏ పేర్కొన్నాయి.