- ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల స్టూడెంట్లు
- నిరంతర టెస్టులు, అదనపు క్లాసులతో ఉత్తమ ఫలితాలు
- ఫ్యాకల్టీ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర స్థాయిలో మంచి స్కోర్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల స్టూడెంట్లు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత ప్రతి స్టూడెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టామని కాలేజీల ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్తో వ్యవహరించినట్టు తెలిపారు. డైలీ టెస్టులు నిర్వహించడంతో అప్పటివరకు జరిగిన సిలబస్ రివిజన్ చేయించారు. ప్రత్యేక శ్రద్ధతో పిల్లల్లో భయం పోగొట్టి, ప్రోత్సహించడం వల్లే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లు ప్రిన్సిపల్స్ చెబుతున్నారు.
లెక్చరర్ల చొరవతో..
మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, బొల్లారం, న్యూ మలక్పేట, నాంపల్లి, బర్కాస్, గన్ ఫౌండ్రీ, ఓల్డ్ సిటీ, హయత్ నగర్ ప్రభుత్వ కాలేజీలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాయి. ఆయా కాలేజీల్లోని ప్రిన్సిపల్స్, లెక్చరర్లు ప్రతి నెలా సిలబస్ రివ్యూ మీటింగ్లపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. న్యూ మలక్ పేట్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్లు స్టేట్ లెవల్ మార్కులను సాధించారు. ఎంతో మంది స్టూడెంట్లు వెయ్యికి 900కు పైగానే స్కోర్ చేసినట్లు ఫ్యాకల్టీ తెలిపారు.
స్పెషల్ ఫోకస్..
గత రెండేళ్లుగా కరోనా ఎఫెక్ట్తో స్టూడెంట్లు చదువులో వెనుకపడిపోవడంతో ఈసారి మునుపటి కంటే ఎక్కువగా వారిపై లెక్చరర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీల్లో క్లాసులు, టెస్ట్లు నిర్వహించేవారు. స్టడీ అవర్స్ పెట్టి డల్ స్టూడెంట్లపై ఫోకస్ చేశారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో స్టూడెంట్లకు భోజనం పెట్టించడంతో పాటు వారికి కావాల్సిన స్టేషనరీ వస్తువులను అందించారు. ప్రభుత్వం అందించే స్టడీ మెటిరీయల్తోపాటు ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులతో లెక్చరర్లు కూడా మెటీరియల్ తయారుచేసి స్టూడెంట్లకు అందించారు. పిల్లల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకునేవారు.
ఉత్తీర్ణత శాతం ఇలా..
మేడ్చల్ జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. కూకట్పల్లి జూనియర్ కాలేజీ సెకండియర్లో 63.4శాతం, ఫస్ట్ ఇయర్ లో 47. 5 శాతం ఉత్తీర్ణత సాధించింది. హైదరాబాద్ ఫలితాల్లో నాంపల్లిలోని ఎంఏఎం ప్రభుత్వ మోడల్ జూనియర్ కాలేజీ 59.31శాతం, హుస్సేనీ ఆలం ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ 53.44 శాతం, ఫలక్నుమాలోని బాలికల జూనియర్ కాలేజీ 45.2శాతం, మైసారం ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ 48.08శాతం, బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ 45.39శాతం ఉత్తీర్ణత సాధించాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ ఇయర్ 75శాతం, ఫస్ట్ ఇయర్ 72శాతం ఉత్తీర్ణత సాధించాయి.
కాలేజీకి బంక్ కొట్టకుండా..
పిల్లలు కాలేజీ బంక్ కొట్టకుండా ప్రతి క్లాస్కు అటెండ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అదనపు క్లాసులు తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థల సాయంతో మిడ్ డే మీల్స్ కూడా పెట్టించాం. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు స్కోర్ చేసిన స్టూడెంట్లకు ప్రైజ్ లు ఇచ్చి ఎంకరేజ్ చేశాం. ప్రతి స్టూడెంట్ పై పర్సనల్ ఫోకస్ పెట్టాం. వారికి సబ్జెక్ట్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా భయం లేకుండా లెక్చరర్లను అప్రోచ్ అయ్యే వాతావరణం కల్పించాం. చిన్న చిన్న టెస్టుల విషయలోనూ చాలా శ్రద్ధ వహించాం. అందుకే రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధించగలిగాం.
- బద్రెసన్, ప్రిన్సిపల్, న్యూ మలక్ పేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ
రివ్యూ మీటింగ్స్ పెడుతూ..
ప్రతి నెల కాలేజీల ప్రిన్సిపల్స్ తో మీటింగ్లు నిర్వహిస్తుంటాం. ఈ మీటింగ్లో సిలబస్, స్టూడెంట్ల పెర్ఫామెన్స్ గురించి డిస్కషన్ జరిగేది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలతో ప్రిన్సిపల్స్తమ కాలేజీల్లో లెక్చరర్లతో రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్లు. అక్కడ నెలకోసారి రివ్యూ సెషన్స్ జరిగేవి. వెనుకపడిపోయిన స్టూడెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పేవాళ్లం. వాళ్లకు అదనపు క్లాసులు తీసుకోవాలని సూచించాం. రిజల్ట్ తక్కువ వచ్చిన కాలేజీలను తరచూ విజిట్ చేసి ప్రిన్సిపల్స్తో స్టూడెంట్ల ఇంప్రూవ్మెంట్గురించి డిస్కస్ చేసేవాళ్లం.
- కిషన్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మేడ్చల్