న్యూఢిల్లీ : దేశంలో రెండో పెద్ద రిఫైనరీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో మెజారిటీ వాటాను ఏదైనా గ్లోబల్ ఆయిల్ కంపెనీకి అమ్మేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కంట్రోలింగ్ వాటా వదులుకోవాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం తొలుత దేశంలోని అతి పెద్ద రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కే తన వాటా అమ్మాలని భావించింది. ఐతే, దాని వల్ల ఆ రంగంలో మోనాపోలీకి అవకాశమిచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇప్పుడు ఏదైనా గ్లోబల్ కంపెనీకి అమ్మాలని భావిస్తోంది. దేశీయ ఇంథన రంగంలో మల్టీ నేషనల్ కంపెనీలను తేవడం ద్వారా మార్కెట్లో పోటీ తేవాలనేది కూడా ప్రభుత్వ వ్యూహాలలో ఒకటిగా తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచీ చమురు రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి మొత్తం 53.3 శాతం వాటా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. లక్ష కోట్లు సమకూర్చుకోవాలని నరేంద్ర మోడి నాయకత్వంలోని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్లోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని కూడా ప్రభుత్వం టార్గెట్గా నిర్ణయించుకుంది. స్లోడౌన్ నేపథ్యంలో రెవెన్యూ కలెక్షన్లు తగ్గుతుండటంతో ఈ లక్ష్యం నెరవేరడం సందేహంగా మారింది. రెవెన్యూ కలెక్షన్ తగ్గడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంక్షేమ ప్రోగ్రామ్స్పై ఖర్చు పెట్టే సామర్థ్యం ప్రభుత్వానికి తగ్గుతుంది.
బీపీసీఎల్ షేరు 7 శాతం జంప్…
సెప్టెంబర్ 12 నాటి షేర్ ముగింపు ధర ఆధారంగా తీసుకుంటే బీపీసీఎల్ అమ్మేయడం వల్ల డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్లో 40 శాతాన్ని ప్రభుత్వం అందుకోగలుగుతుంది. బీపీసీఎల్ వాటా అమ్మకం గురించి మాట్లాడేందుకు ఆర్థిక శాఖలోని అధికార ప్రతినిధి రాజేష్ మల్హోత్రా అందుబాటులోకి రాలేదు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో శుక్రవారం డిజిన్వెస్ట్మెంట్ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 7.1 శాతం పెరిగి రూ. 411.55 వద్ద ట్రేడైంది.
పార్లమెంట్ అనుమతి కావాలి..
బీపీసీఎల్ డిజిన్వెస్ట్మెంట్పై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా, ఒక కొలిక్కి రావడానికి ఎంత కాలం పడుతుందనేది కచ్చితంగా తెలియదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్ను ప్రైవేటుకి ఇచ్చేయాలంటే పార్లమెంట్ అనుమతి కూడా కావల్సి ఉంటుంది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో ఇండియాలో రిఫైనింగ్ రంగం పట్ల ఆసక్తిగా ఉంది. ఇటీవలే ఆర్ఐఎల్తో జత కూడా కట్టింది. మరోవైపు రష్యా కంపెనీ రాస్నెఫ్ట్ కూడా ఇండియాలో ఆయిల్ రిఫైనింగ్, మార్కెటింగ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇంకా టోటల్ ఎస్ఏ, షెల్ అండ్ పీపీ పీఎల్సీలూ ఇండియాలోని తమ ఫ్యూయెల్ రిటైలింగ్ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. 2040 నాటికి ఇండియా ఎనర్జీ డిమాండ్ రెట్టింపవుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీలు అంచనా వేస్తున్నాయి.
ఒకసారి ప్రయత్నించి విఫలం..
ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నం ఇంతకు ముందు ఒకసారి జరిగినా, అది విఫలమైంది. హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)ను సింగిల్ ఇన్వెస్టర్కు అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అలాగే, బీపీసీఎల్ను పబ్లిక్కు తీసుకు వెళ్లాలనే ప్రతిపాదనకూ గండి పడింది. ఈ ప్రతిపాదనపై కార్మికులు, రాజకీయ వర్గాల నిరసనల నేపథ్యంలో సుప్రీం కోర్టు 2003 లో బ్రేక్ వేసింది.
