హైదరాబాద్, వెలుగు: కరోనా ప్యాకేజీల ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. క్యాష్ పేమెంట్ ఎంచుకున్నవాళ్లకే సర్కారీ ప్యాకేజీల చార్జీలు వర్తిస్తాయని, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకున్నవాళ్లకు వర్తించవని స్పష్టం చేసింది. దీంతో ఇకపై హాస్పిటల్స్తో ఉన్న ఒప్పందం మేరకే ఇన్సూరెన్స్ కంపెనీలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా పేషెంట్ల సాధారణ ఐసోలోషన్కు రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో ఉంటే రోజుకు రూ.7,500, వెంటిలేటర్ పెడితే రోజుకు రూ.9 వేలు చార్జ్ చేయాలని నెల రోజుల కిందట సర్కారు జీవో జారీ చేసింది. తమ కస్టమర్లకు ఈ జీవో ప్రకారమే చార్జ్ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలు పట్టుబట్టాయి. దీంతో ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్లను అడ్మిట్ చేసుకునేందుకు హాస్పిటల్స్ ఒప్పుకోవడం లేదు. క్యాష్ పేమెంట్ చేస్తామని ఒప్పుకుని, అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన వాళ్లకే ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. దీనిపై కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు పది రోజుల క్రితం మంత్రి ఈటల రాజేందర్ను కలిసి, జీవోలో మార్పులు చేయాలని కోరాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ప్యాకేజీలే చెల్లిస్తే వర్కవుట్ కాదని చెప్పుకొచ్చాయి. ప్యాకేజీ జీవోలో సర్కార్ మార్పులు చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పందం ప్రకారమే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇన్సూరెన్స్ ఉన్నాఖర్చు తప్పదు
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్లకు కూడా కరోనా ట్రీట్మెంట్ ఖర్చులు తప్పడం లేదు. ప్రైవేటు హాస్పిటళ్లలో పీపీఈ కిట్లు, డిస్పోజబుల్స్కు అడ్డగోలుగా చార్జ్ చేస్తుండడంతో వాటిని చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లో మందులు, బెడ్ చార్జీలు, డాక్టర్స్ కన్సల్టేషన్, పేషెంట్కు భోజనం, నర్సింగ్ (పేషెంట్ మానిటరింగ్), సీబీసీ, ఎక్స్ రే, 2డీఎకో వంటి కొన్ని టెస్టులు కూడా కవర్ అవుతున్నయి. కానీ పీపీఈ కిట్లకు మాత్రం అదనంగా చార్జ్ చేసుకునేందుకు అనుమతించారు. దీంతో ఒక్క రోజుకే రూ.5 నుంచి పది వేలు కేవలం పీపీఈ కిట్ల పేరిటే వసూలు చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఖర్చు తప్ప, ఇలాంటి అదనపు ఖర్చులు చెల్లించేదిలేదని ఇన్సూరెన్స్ కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం చేసిన మార్పులతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్లకు కొంత ఊరట లభించినా, హాస్పిటళ్లు వేసే అదనపు బిల్లులు కట్టుకోకతప్పని పరిస్థితి నెలకొంది.