కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో కొనసాగుతున్న డయాలసిస్ సెంటర్ను క్లోజ్ చేయవద్దని పలువురు పేషెంట్లు, వారి బంధువులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చి అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డితో పాటు సిరిసిల్లా, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు పేషెంట్లు ఇక్కడకు డయాలసిస్ కోసం వస్తున్నారన్నారు. దీని కాలపరిమితి అయిపోతుందని మూసివేస్తున్నట్లు చెబుతున్నారన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న డయాలసిస్సెంటర్లో 5 బెడ్లు ఉన్నాయని అవి సరిపోవడం లేదన్నారు.
ప్రైవేట్లో ఉన్న సెంటర్ను యథావిధిగా కొనసాగిస్తే పేషెంట్లకు మేలు జరుగుతుందన్నారు. కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని సబ్రిజిష్ట్రర్ ఆఫీసుకు పాతరాజంపేట శివారుకు మార్చవద్దని కోరుతూ రియల్ ఎస్జేట్ వ్యాపారులు వినతి పత్రం అందించారు. టౌన్కు దూరంగా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆయా శాఖల ఆఫీసర్లు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
సౌత్ క్యాంపస్లో పీజీ సెమిస్టర్ పరీక్షలు
భిక్కనూరు, వెలుగు: మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్లో సోమవారం నుంచి పీపీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నాయని క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లావణ్య తెలిపారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం (రెండో సెమిస్టర్) పరీక్షల్లో మొత్తం 153 మంది విద్యార్థులకు గాను 150 మంది హజరయ్యారని చెప్పారు.
15 నుంచి 22 వరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ
ఆర్మూర్, వెలుగు: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి 22 వరకు 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేయనున్నట్లు జరుగుతుందని డిప్యూటీ డీఎం హెచ్వో రమేశ్ చెప్పారు. సోమవారం ఆర్మూర్లో జరిగిన డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు ఆహారం తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కోకుంటే నులి పురుగులు కడుపులో చేరి రక్తహీనత కలిగిస్తాయన్నారు. దీంతో బుద్ధి మాంద్యం వస్తుందని, శారీరక ఎదుగుదల నిలిచిపోయిందన్నారు. దీన్ని నివారించడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ సంవత్సరంలో రెండు సార్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, సాయి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ 30గేట్లు ఓపెన్..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది. సోమవారం ఉదయం నుంచి 1,83,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ రవి తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండు కుండల మారింది. ఎగువ నుంచి భారీ ఇన్ ఫ్లో రావడంతో 30 గేట్లను ఎత్తి 1,99,928 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాల్వ ద్వారా2 వేలు క్యూసెక్కులు, ఎస్కేఫ్ గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.
- మెండోరా, వెలుగు
యాక్సిడెంట్లో ఆర్మీ జవాన్ మృతి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లికి చెందిన జవాన్ అరుణ్ (21) బైక్ అదుపు తప్పి చనిపోయారు. ఆర్మీలో జవాన్గా పని చేస్తున్న అరుణ్ సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి తమ సొంతూరు నుంచి నుంచి బైక్పై భూంపల్లికి వెళ్తుండగా మార్గ మధ్యంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయారు. రాత్రి పూట ఎవరు గమనించలేదు. తీవ్రగాయాలైన ఆయన సోమవారం ఉదయం వరకు చనిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
క్రికెట్ ప్లేయర్లను సన్మానించిన కలెక్టర్
కామారెడ్డి, వెలుగు: ఇంటర్నేషనల్క్రికెట్ పోటీలకు సెలక్ట్ అయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కాలేజీ స్టూడెంట్ మహ్మద్ ఇస్తాక్ను సోమవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీల్లో పోటీలు జరగనున్నాయి. పోటీల్లో విజేతగా గెలుపొందాలని కలెక్టర్ స్టూడెంట్లకు సూచించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, శ్రీఆర్యభట్ట జూనియర్కాలేజీ ప్రిన్సిపాల్ హన్మంత్రావు పాల్గొన్నారు.
టీయూ వీసీ దిష్టిబొమ్మ దహనం
బోధన్, వెలుగు: తెలంగాణ యూనివర్సీటీ వీసీ తీరును నిరసిస్తూ పీడీఎస్యూ నాయకులు సోమవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గౌతంకుమార్ మాట్లాడుతూ వీసీ తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే విద్యార్థి సంఘ నాయకులపై చర్యలకు దిగారన్నారు. ఆయన తీరును వ్యతిరేకిస్తున్నమన్నారు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో స్టూడెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. యూనివర్సిటిలో ప్రశ్నించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వీసీపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివేక్, రాజు, ప్రకాశ్, ఆకాశ్, మారుతి, వెంకట్ పాల్గొన్నారు.
గురుకులాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్
భిక్కనూరు, వెలుగు: కలెక్టర్ ఆదేశాల మేరకు భిక్కనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం స్పెషల్ ఆఫీసర్ వీరానందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్ నరసింహారెడ్డితో మాట్లాడుతూ స్టూడెంట్లకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించి సూచించారు. అనంతరం పాఠశాల, కళాశాల పరిసరాలు, మేస్ను పరిశీలించారు. హాస్టల్ అవరణలో నాటిన హరితహారం మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆయన ఎంట ఎంపీడీవో అనంతరావు, సర్పంచ్ జనగామ శ్రీనివాస్, సెక్రటరీ సౌజన్య సిబ్బంది ఉన్నారు.
అన్ని ఆఫీసులు ఇక్కడికే రావాలి
నిజామాబాద్ టౌన్, వెలుగు: అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను కొత్త కలెక్టరేట్లో తక్షణమే మార్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సుమారు 40 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాల కోసం కలెక్టరేట్లో అధునాతన సదుపాయాలతో కూడిన గదులు కేటాయించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లోకి తమ ఆఫీస్ను మార్చుకోనట్లయితే వెంటనే షిఫ్ట్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల పాలనాపరమైన సౌలభ్యంతో పాటు ప్రజలకు కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు అందుబాటులోకి వచ్చినట్లవుతుందన్నారు. కాగా కొత్త కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుంచి మొత్తం 59 వినతులు వచ్చాయి. వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
జాతీయ యోగా పోటీలకు జిల్లా విద్యార్థులు
నిజామాబాద్ టౌన్, వెలుగు: అక్టోబర్ 28 నుంచి పంజాబ్లో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 10, 11వ తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజయ్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు అమృత, లాస్య ప్రియ, శ్రీనిధి, ఉమైన్ జా ఆపిషిన్, సాహితీ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అమృత లత, కరస్పాండెంట్ ప్రభాదేవి వారిని అభినందించారు.
సమస్యలు పరిష్కరించాలి
బోధన్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు బోధన్ ఆర్డీవో రాజేశ్వర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జె.శంకర్గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాంద్ చేశారు. వీరికి న్యాయం చేయకపోతే రాబోవు ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఉమా, కాంత, విజయలక్ష్మి, గంగామణి, రూప, అమిత, వాసిన బేగం, మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
వర్ని, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.3 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మికి అందజేశారు. ఈనెల 13న ఎమ్మెల్యే, 14న ఎంపీ ఇళ్ల ముందు ధర్నా నిర్వహిస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షుడు నన్నేసాబ్ తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పాలకులు తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
లారీ ఢీకొని ఒకరు మృతి
బాల్కొండ, వెలుగు: లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు బాల్కొండ ఎస్సై గోపి తెలిపారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఓ లారీ బాల్కొండ శివారులో బైక్పై వెళ్తున్న బాల్కొండ వాసులను వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన జంగం రాజలింగం(48) స్పాట్లోనే చనిపోగా బోజగోళ్ల గంగారాం (45)కు తీవ్ర గాయలయ్యాయి. గాయాలపాలైన ఆయనను ఆర్మూర్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. రాజలింగం డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం బాల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.
స్కాలర్షిప్లు విడుదల చేయాలి
ఆర్మూర్/కామారెడ్డి, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్మూర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీస్ స్టాఫ్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఏరియా ప్రెసిడెంట్ అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం స్టూడెంట్లపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. స్టూడెంట్ల హక్కులను, డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా విద్యాశాఖ మంత్రి కొట్టి పారేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్రంలో పెడింగ్లో ఉన్న రూ.3,800 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాడ్ చేశారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు వినోద్, నవీన్, సాయి స్టూడెంట్లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో పీడీఎస్యూ జిల్లా ప్రెసిడెంట్జి.సురేశ్, జనరల్ సెక్రటరీ అనిల్, లీడర్లు హరిచంద్ర, వినయ్ శ్రీరామ్, కృష్ణ, రవి పాల్గొన్నారు.
టీయూ వీసీని తొలగించండి
నిజామాబాద్, వెలుగు: అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీయూ వీసీ రవీందర్ గుప్తాను వెంటనే తొలగించాలని పీడీఎస్యూ నగర వైస్ప్రెసిడెంట్ సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఇందూరులో ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజీ ఎదుట పీడీఎస్యూ ప్రతినిధులు సోమవారం వీసీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. టీయూలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై పీడీఎస్యూ నిర్విరామంగా పోరాడుతోందని అందుకే తమ సంఘ నాయకులపై చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ లీడర్లు పవన్, సునీల్, రమేశ్, సరిత, లావణ్య, నరేశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
తప్పులను ప్రశ్నిస్తే బెదిరింపులా?
డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో వీసీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకు స్టూడెంట్లీడర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పీడీఎస్యూ జిల్లా సెక్రటరీ జన్నారపు రాజేశ్వర్ మండిపడ్డారు. వీసీ తీరును నిరసిస్తూ సోమవారం క్యాంపస్లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ వర్సిటీలో నెలకొన్న సమస్యలు, గర్ల్స్ హాస్టల్లో వీసీ నిర్వాకంపై నిరసనలు తెలిపిన స్టూడెంట్లీడర్లపై కేసులు పెడుతామని వర్సిటీ ఆఫీసర్లు పత్రిక ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో కేసులని స్టూడెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులని నొక్కాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. లీడర్లు ఉమేశ్చంద్ర, రవీందర్, మోహన్ పాల్గొన్నారు.