భూములకు కొత్త నక్షా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక

 భూములకు కొత్త నక్షా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక
  • మంచిర్యాలలో 11, ఆసిఫాబాద్​లో 37, నిర్మల్ 14, ఆదిలాబాద్​లో ​8 
  • భూముల సరిహద్దుల నిర్ణయం, కొత్తగా మ్యాపుల తయారీ
  • భూసమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సర్కారు చర్యలు 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో త్వరలోనే రీసర్వే నిర్వహించి కొత్త నక్షాల తయారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే గెజిట్​ రిలీజ్ ​చేయగా జనవరిలో సర్వే ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ మేరకు రెవెన్యూ, ల్యాండ్ ​రికార్డ్స్ అండ్​సర్వే యంత్రాంగం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో నక్షాలు అందుబాటులేని 70 గ్రామాల్లో రీసర్వే నిర్వహించనున్నారు. ఈ జాబితాలో అత్యధికంగా కుమ్రం భీం​ ఆసిఫాబాద్​జిల్లాలో 37 గ్రామాలు ఉండగా, నిర్మల్​లో 14, మంచిర్యాలలో 11, ఆదిలాబాద్​లో ఎనిమిది గ్రామాలున్నాయి. 

పైలట్​ గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తి

భూముల రీసర్వే ద్వారా ఆయా భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించడంతో పాటు సర్వే నంబర్ల వారీగా కొత్తగా మ్యాప్​లను రూపొందించనున్నారు. పైలట్ ​ప్రాజెక్టు కింద ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీర్​పూర్​మండలం కోమన్​పల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, సంగారెడ్డి జిల్లా వల్​పల్లి మండలంలోని సాహెబ్​నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ ​మండలం నూగూరు, మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్​ మండలం సలార్​నగర్​లో ప్యూర్​ గ్రౌండ్​ ట్రూతింగ్​ పద్ధతిలో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులను గుర్తించి మ్యాప్​లు రూపొందించారు. ఇదే విధంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. ఏ సర్వే నంబర్​లో ఎంత భూమి ఉందనే లెక్కలు తేల్చనున్నారు. ఈ సర్వే సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం 

రీసర్వే ద్వారా గ్రామాల్లోని భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రతి కమతానికి ప్రత్యేకంగా మ్యాప్ అందుబాటులోకి రావడంతో ల్యాండ్​సర్వే సులభతరం కానుంది. ఇకపై భూ భారతి పోర్టల్​ ద్వారా ఆన్​లైన్​లోనే డిజిటల్​సర్వే మ్యాప్​లను పొందే అవకాశం ఉంటుంది. భూముల సరిహద్దు వివాదాలకు ఆస్కారమే ఉండదు. దీంతో పాటు గవర్నమెంట్, ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్​ భూముల సరిహద్దులపై క్లారిటీ వస్తుంది. పొరుగు భూముల యజమానులతో వచ్చే గొడవలకు అడ్డుకట్ట పడటమే కాకుండా భూముల క్రయవిక్రయాల్లో మోసాలు సైతం తగ్గుతాయని భావిస్తున్నారు. 

రీసర్వేకు ఎంపిక చేసిన గ్రామాలివే..

ఆసిఫాబాద్​ జిల్లా: భట్​పల్లి(బెజ్జూర్ మండలం), దొంగర్​గావ్(తిర్యాణి), వాడిగొండి, దానాపూర్, సుద్దాఘాట్, ఎడసగుండి, కుటోడ, సిరస్గావ్(ఆసిఫాబాద్), లంజన్వీర(వాంకిడి), బందెపల్లి(చింతలమానెపల్లి), (కెరమెరి), చందారం(కౌటాల), భోగారం, పోలంపల్లె, కమ్మర్​పల్లి(దహెగాం), చింతకుంట(సిర్పూర్​టౌన్), శంకరగూడ(కెరమెరి), ఇందాపూర్(కెరమెరి), రవీంద్రనగర్(చింతలమానేపల్లి), గార్లపేట, టోకిని(సిర్పూర్​ టౌన్), సీతానగర్, నజ్రుల్​నగర్(కాగజ్​నగర్), కోత, లకంపూర్, ఆరికెపల్లి, అంతాపూర్, ఇసాపూర్, గౌరీ, ఆరెపల్లి, భోలెపత్తూర్, పరస్వాడ, అనార్​పల్లి, నర్సాపూర్​(కెరమెరి), జెండగూడ (జైనూర్), తెల్గపల్లి (పెంచికల్​పేట).

మంచిర్యాల జిల్లా: చిన్నవెంకటాపూర్, పుప్పాలవానిపేట(నెన్నెల), తంగళ్లపల్లి(భీమిని), రాంపూర్(తాండూర్), కొత్తపల్లి(వేమనపల్లి), ఆడ్కపల్లి, కావర్​ కొత్తపల్లి(కోటపల్లి), కిష్టంపేట(చెన్నూర్), పారుపల్లి(కోటపల్లి), మద్దికల్(భీమారం), చెన్నూరు.
    
నిర్మల్​ జిల్లా: వాపూర్​ రూరల్(ఖానాపూర్), రేవోజీపేట(దస్తురాబాద్), దంతంపల్లి(మామడ), మల్లాపూర్(లక్ష్మణచాంద), కౌట్ల బుజుర్గ్, నాగపూర్(సారంగాపూర్), తురాటి(నర్సాపూర్​(జి), లబ్డి(బాసర), చాకెపల్లి(నర్సాపూర్​జి), వెల్మల్(సోన్), తానూర్, వాలెగావ్(భైంసా), ఇస్లాంపూర్(కడెం), బామ్ని(కె)(లోకేశ్వరం).

ఆదిలాబాద్​ జిల్లా : వడ్గల్పూర్, బుజుర్గ్(ఉట్నూర్), పోచంపల్లి, లచింపూర్(కె), లచింపూర్(బి)(సిరికొండ), మాన్కాపూర్(పి)(బజార్​హత్నూర్​), చిక్డారి ఖానాపూర్(ఆదిలాబాద్​ రూరల్), బుద్దికొండ (నేరడిగొండ).