మనదేమన్నా బనానా రిపబ్లికా..? ఆయిల్ కొనటానికి అమెరికా అనుమతేంటి..? ఏకిపారేసిన కాంగ్రెస్

మనదేమన్నా బనానా రిపబ్లికా..? ఆయిల్ కొనటానికి అమెరికా అనుమతేంటి..? ఏకిపారేసిన కాంగ్రెస్

భారతదేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు.. భారతదేశంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. భారత్ ఏం చేయాలి.. ఏం చేయకూడదు అని అమెరికా నిర్ణయించటం ఏంటీ.. ఇది భారత సార్వభౌమాధికారానికి భంగం కాదా.. భారతదేశం ఆయిల్ ఎక్కడ కొనాలో అమెరికా చెప్పటం ఏంటీ.. మనం ఆయిల్ కొనుగోలు చేయటానికి అమెరికా అనుమతి ఇవ్వటం ఏంటీ.. మనం యుద్ధం చేయాలా వద్దా అనేది అమెరికా నిర్ణయించటం ఏంటీ.. మనం యుద్ధం ఆపేశామని అమెరికా ప్రకటించటం ఏంటీ.. భారతదేశంలో అసలు ప్రభుత్వం ఉందా అంటూ ఏకిపారేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 

రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయటానికి అమెరికా 30 రోజుల అనుమతి ఇవ్వటం ఏంటని నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇండియాకు క్రూడ్ ఆయిల్ సరఫరా కష్టంగా మారింది. దీంతో రష్యాతో ఆయిల్ కొనేందుకు అమెరికా పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఇండియా ఎక్కడ చమురు కొనాలో అమెరికా నిర్ణయించడం.. భారత సార్వభౌమాధికారాన్ని అవమానించినట్లేనని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ట్రంప్ మరో కొత్త ఆట.. యుద్ధం కొలిక్కి వచ్చే వరకు.. పుతిన్ నుంచి ఆయిల్ కొనవచ్చునని కేంద్ర ప్రభుత్వానికి అమెరికా అనుమతి ఇచ్చిందట.. అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యంగ్యాత్మక ట్వీట్ చేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసి.. జైరాం రమేష్ పోస్ట్ చేశారు. 

అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రష్యా నుంచి ఇండియా 30 రోజుల పాటు ఆయిల్ కొనవచ్చు. షార్ట్ టైమ్ లో ఇది రష్యాకు మేలు చేసే అంశమేం కాదు. ఇండియా యూఎస్ కు భాగస్వామి. అమెరికా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియా అంగీకరించిన క్రమంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి కొనేందుకు అనుమతిస్తున్నాం.. అంటూ స్కాట్ ట్వీట్ చేశారు.

►ALSO READ | బెంగళూరు కాలేజీల్లో డ్రగ్స్ కలకలం: పోలీసుల తనిఖీల్లో 31 మంది విద్యార్థులకు పాజిటివ్!

మనది బనానా రిపబ్లిక్ నా..?

ఆయిల్ కొనుగోలుకు అమెరికా పర్మిషన్ ఇవ్వటంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తీవ్ర విమర్శలకు దిగారు. ఎక్స్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయిల్ కొనుగోలుకు 30 రోజులు ఉపశమనం కల్పించడం అంటే.. నయా సామ్రాజ్యవాద అహంకారం ఇక్కడ కనిపిస్తుంది. మనది ఏమైనా బనానా రిపబ్లిక్ నా..? ఎక్కడ ఏం కొనాలో యూఎస్ నిర్ణయించేందుకు...? చిన్న విషయానికి గొంతు చించుకుని మాట్లాడే నేతల మౌనంగా ఉన్నారేంటి..? సార్వభౌత్వం అంటే వాళ్లకు అర్థం తెలుసా..? అంటూ విరుచుకుపడ్డారు. 

ప్రభుత్వం ఢిల్లీ నుంచే నడుస్తోందా..?

బీజేపీ ప్రభుత్వం భారత స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని అమెరికా ముందు కాంప్రమైజ్ అయ్యేలా చేసింది. ప్రతి విసయంలో యూఎస్ తలదూర్చడం దారుణం. ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్, రష్యా-ఇండియా ట్రేడ్.. మొదలైన ప్రతి అంశంలో అమెరికా డిసైడ్ చేస్తే.. ఇక ఇండియా ప్రభుత్వం ఎందుకు? అసలు ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుందా..? అమెరికా నుంచి నడుస్తుందా..? అంటే కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రశ్నించారు. 

నరేందర్.. సరేండర్: సోషల్ మీడియాలో మీమ్స్:

భారత్ పై అమెరికా పెత్తనమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. నరేందర్.. సరేండర్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు లొంగిపోయారనే ఉద్దేశంతో ట్వీట్స్ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఇండియా స్వతంత్ర్య గణతంత్ర్య దేశం అని భావిస్తున్నాం.. కానీ మోదీ పాలనలో అమెరికాకు గులాం అంటున్నారు.. మన సార్వభౌమాధికారాన్ని అమెరికా ముందు పెట్టడమేంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అదే క్రమంలో గతంలో అమెరికా గురించి మోదీ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇండియా వీసా కోసం అమెరికా లైన్లో నిలిచే రోజు కోసం నేను కలగంటున్నా.. అంటూ అప్పట్లో మోదీ చేసిన స్టేట్ మెంట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆడుకుంటున్నారు.