హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటళ్లలోనూ కరోనా ట్రీట్మెంట్కు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా లక్షణాలతో ప్రైవేటు హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు సంబంధించి ఎలా వ్యవహరించాలన్న దానిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదివారం గైడ్ లైన్స్ జారీ చేశారు. ఐసీఎంఆర్ సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి స్థాయిలో ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఒక్కో డాక్టర్ గంటకు గరిష్టంగా ఐదుగురు పేషెంట్లకు మాత్రమే అపాయింట్ మెంట్ ఇవ్వాలని, వారిని మాత్రమే పరీక్షించాలని గైడ్లైన్స్లో స్పష్టం చేశారు. ఒక్కో పేషెంట్ వెంట ఒక సహాయకున్ని మాత్రమే అనుమతించాలని.. హాస్పిటల్ స్టాఫ్, పేషెంట్లు, అటెండర్లు అంతా పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు, గ్లౌజులు ధరించాలని సూచించారు. మాస్క్ లేకుండా ఎవరినీ హాస్పిటల్లోకి అనుమతించొద్దని ఆదేశించారు. పేషెంట్లు, సహాయకులు, సిబ్బంది ఎవరైనా హాస్పిటల్ లోకి రావడానికి ముందే హ్యాండ్ వాష్ చేసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం, ఇతర కరోనా లక్షణాలు ఉంటే కరోనా హాస్పిటళ్లకు రిఫర్ చేయాలన్నారు.
హాస్పిటళ్లకు మార్గదర్శకాలివీ..
- కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటళ్లు, క్లినిక్స్, పాలిక్లినిక్స్, నర్సింగ్ హోమ్ లకు ఉన్న గైడ్లైన్స్ పాటించాలి.
- కరోనా అనుమానిత రోగులు వస్తే..
- వారి టెస్టుల రిజల్ట్స్ వచ్చే వరకు
- ఐసోలేషన్ రూమ్ లో ఉంచాలి.
- ల్యాబ్ టెక్నిషియన్లు స్వాబ్స్ తీసేప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
- కరోనా సస్పెక్టర్స్ రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలి. హాస్పిటల్లో కరోనా జోన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో తప్పకుండా ఆపరేషన్, పోస్టు ఆపరేషన్ వార్డు, లేబర్ రూమ్, ఐసీయూ, వెంటిలేటర్లు ఉండాలి. ఆ జోన్ లో పనిజేసే డాక్టర్లు, స్టాఫ్ అంతా భద్రతా ప్రమాణాలు పాటించాలి.
- అవసరాన్ని బట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనస్తీషియన్స్, ఇతర సంబంధిత స్పెషలిస్టులు అందుబాటులో ఉండాలి.
- పాజిటివ్ పేషెంట్ల ట్రీట్మెంట్ విధానాలకు సంబంధించి ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలను విధిగా పాటించాలి.
- ఒకవేళ ఎవరైనా కరోనా లక్షణాలతో మరణిస్తే.. మృతదేహాన్ని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం డిస్పోజ్ చేయాలి