
- హరీశ్రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
- రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నం
- రైతులు సంతోషంగా ఉంటే హరీశ్ రావు ఉక్కిరిబిక్కిరైతున్నడు
- గత సర్కార్ తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం
- అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: లక్ష రుణమాఫీని ఐదేండ్లు సాగదీసిన బీఆర్ఎస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రుణమాఫీని అమలు చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, దీన్ని భరించలేక హరీశ్రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పుల వల్లే కొంత మంది రైతులకు రుణమాఫీ ఆలస్యమవుతున్నదని ఆదివారం ఆయన మీడియాతో అన్నారు. తాము కొత్తగా ఎలాంటి రూల్స్ పెట్టలేదని చెప్పారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్రావు పనిగా పెట్టుకున్నారన్నారు. ‘‘రైతుబంధు పేరు జెప్పి మిగతా స్కీంలన్నీ గత బీఆర్ఎస్ సర్కార్ పక్కనపెట్టింది. పదేండ్లు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వలేదు. రైతుల సబ్సిడీలన్నింటిని ఎత్తివేసిన చరిత్ర గత కేసీఆర్ సర్కార్ ది. రైతుల గురించి బీఆర్ఎస్ నాయకులు, హరీశ్రావు , కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హరీశ్రావు పిచ్చి ప్రేలాపనలు ఆపాలి. రైతులను రెచ్చగొట్టడానికి హరీశ్ రావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు” అని ఆయన అన్నారు.
జనంలోకి ప్రతిపక్ష నేత ఎందుకు పోతలే?
రాష్ట్రం వరదలతో అతలాకుతలమై జనం ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు జనంలోకి వెళ్లడం లేదని, ఎందుకు పరామర్శించడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ‘‘ పంట నష్టంతో రైతులు ఆందోళనలో ఉంటే.. ఒక్కరినైనా కేసీఆర్ పరామర్శించారా? రుణమాఫీ పై కూడా స్పందించలేదు. రైతులకు మంచి జరిగితే కూడా అభినందించలేని బిజీలో ఉన్నడు. మామ ఫామ్హౌస్లో, బామ్మర్ది అమెరికాలో జల్సా చేస్తుంటే.. రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలను అల్లుడు(హరీశ్) రెచ్చగొడుతున్నడు” అని ఆయన మండిపడ్డారు.