రాష్ట్ర పథకాలు భేష్.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

రాష్ట్ర పథకాలు భేష్.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటన 
  • రామప్ప, కోటగుళ్లలో పూజలు,లక్నవరం సందర్శన

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌ ‌‌కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. మంగళవారం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గవర్నర్‌‌‌‌ పర్యటించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో ఆఫీసర్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన కవులు, రచయితలు, టీచర్లు, క్రీడాకారులతో సమావేశమైన గవర్నర్.. వారితో పాటే మధ్యాహ్నం లంచ్‌‌‌‌ చేశారు.

అనంతరం రామప్ప టెంపుల్‌‌‌‌లో, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లా గణపురం కోటగుళ్లలో గణపేశ్వరాలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. ములుగు జిల్లాలోని లక్నవరంను సైతం ఆయన సందర్శించారు. పేదలు, గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తోందని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని గిరిజనులు, ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఆధునిక సమాజంలో ఆదివాసీలు, గిరిజనులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.

గిరిజనుల కోసం కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌ అభినందించారు. తాను త్రిపుర రాష్ట్రంలో రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ మంత్రిగా పనిచేసినప్పటి అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆదివాసీల, గిరిజనుల అభ్యున్నతికి ఆఫీసర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. గవర్నర్‌‌‌‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో తన మొదటి పర్యటనకు షెడ్యూల్ ప్రాంతమైన ములుగు ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

రామప్ప టెంపుల్‌‌ మహాద్భుతం.. 

వందల ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప టెంపుల్‌‌‌‌ మహాద్భుతమని గర్నవర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్‌‌ను సందర్శించేందుకు వచ్చిన గవర్నర్‌‌‌‌కు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గైడ్‌‌‌‌ విజయ్‌‌‌‌ టెంపుల్‌‌‌‌ విశేషాలను గవర్నర్‌‌‌‌కు వివరించారు.

800 ఏండ్ల కిందటే రామప్పలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని గవర్నర్‌‌‌‌ అన్నారు. కాకతీయుల వైభవాన్ని చాటే గొప్ప కట్టడం ఘనపేశ్వరాలయం అని అన్నారు. సుమారు 12వ శతాబ్దంలో కాకతీయులు అద్భుతమైన ఆలయాలు నిర్మించారని తెలిపారు.