- వాళ్లను ఏ కోటాలో నామినేట్ చేశారో పేర్కొనలేదన్న తమిళిసై
- గతంలో కౌశిక్ రెడ్డి ఫైలును పెండింగ్లోనే పెట్టిన గవర్నర్
- మధుసూదనాచారి పేరు ప్రతిపాదిస్తూ మళ్లీ ప్రపోజల్ పంపాకే ఆమోదం
- సర్కారు పేర్లు మార్చి పంపుతుందా? కేటగిరీపై క్లారిటీ ఇస్తుందా? అనే దానిపై ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదించలేదు. చాలా రోజులుగా పెండింగ్లోనే పెట్టారు. గవర్నర్గా నాలుగేండ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం తమిళిసై మీడియాతో ఇంటరాక్ట్అయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పదవులు కావన్నారు. ఇద్దరి పేర్లు గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తున్నట్టుగా తనకు ప్రపోజల్ వచ్చిందని, కానీ వారిని ఏ కేటగిరీలో నామినేట్ చేస్తున్నారనేది పేర్కొనలేదని చెప్పారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై డైలమా నెలకొంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సోషల్ సర్వీస్ కేటగిరీలో గవర్నర్కోటా ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి పేరును నామినేట్చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి పంపింది. అయితే దానికి ఆమోదం తెలుపకుండా గవర్నర్పెండింగ్లో పెట్టారు. దీంతో కౌశిక్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపిన బీఆర్ఎస్ సర్కారు.. ఆయన స్థానంలో మాజీ స్పీకర్మధుసూదనాచారి పేరు ప్రతిపాదిస్తూ మళ్లీ రాజ్భవన్కు ప్రపోజల్ పంపింది. దీనికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు.
ఆమోదం అనుమానమే
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్గతంలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆ తర్వాత పీఆర్పీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఎరుకుల కులానికి చెందిన నాయకుడు. ఇద్దరి నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారి పేర్లకు ఆమోదం తెలుపాలని కేబినెట్భేటీ తర్వాత మంత్రి కేటీఆర్ మీడియా ద్వారా గవర్నర్ను కోరారు. అయితే ఇద్దరి పేర్లను ఏ కేటగిరీలో నామినేట్చేశారో పేర్కొనకపోవడంతో పెండింగ్లో పెట్టినట్లు గవర్నర్ చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరి పేర్లకు గవర్నర్ఆమోదం తెలుపుతారా? అలాగే పెండింగ్లో పెడుతారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
గవర్నర్ మాటలను బట్టి చూస్తే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లకు ఆమోదం తెలపడం అనుమానమేనని బీఆర్ఎస్ నేతలే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపోజల్కు నిర్దేశిత సమయంలోగా అనుమతి ఇవ్వాలన్న నిబంధన లేకపోవడంతో గవర్నర్ ఇలానే పెండింగ్లో పెడితే పరిస్థితి ఏమిటనే దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. కౌశిక్రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరు ప్రతిపాదించినట్టు ఇప్పుడు ప్రపోజ్చేసిన లీడర్ల పేర్లను మార్చుతారా? లేక వారి పేర్లనే నిర్దేశిత కేటగిరీలో ప్రతిపాదిస్తూ మళ్లీ రాజ్భవన్ఆమోదం కోసం పంపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.