
ప్రతి ఒక్కరు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్ ) నేర్చుకోవాలని గవర్నర్ తమిళి సై అన్నారు. రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో గాంధీ మెడికల్ కాలేజ్ కు చెందిన వైద్యులతో సీపీఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై.. సామాన్య ప్రజలకు సీపీఆర్ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. సీపీఆర్ లైఫ్ సేవింగ్ ప్రోగ్రాం అని..టీవీల్లో చూసైనా నేర్చుకోవాలని సూచించారు. సీపీఆర్ తెలియక ఎంతో మంది హర్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మందికి పబ్లిక్ ప్లేసుల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని తమిళి సై అన్నారు. రెండు మూడు సార్లు ట్రైన్, ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు తన ముందే హార్ట్ స్ట్రోక్ వస్తే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడానని చెప్పారు. తాను డాక్టర్ అని తెలియక చాలా మంది తనను పిలవరని అన్నారు. దేశ వ్యాప్తంగా రెండు శాతం మందే సీపీఆర్ నేర్చుకున్నారని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సీపీఆర్ నేర్చుకున్న వాళ్లు చాలా ఎక్కువగా ఉంటారని చెప్పారు.