
దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో 100 శాతం సీట్ల బుకింగ్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. రోజు వారీ కరోనా కేసులు తగ్గుతూ వస్తుండడంతో ప్రస్తుతం ఉన్న 85 శాతం నిబంధనను తొలగించి.. 100 శాతం ఆక్యుపెన్సీకి పెంచుతూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18 నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుందని ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుండడంతో పాటు కొత్తగా కరోనా కేసుల నమోదు తగ్గుతుండడంతో దేశీయంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎయిర్లైన్, ఎయిర్పోర్టు ఆపరేటర్లు తప్పనిసరిగా కరోనా ప్రొటోకాల్ పక్కాగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో గత ఏడాది మార్చి 22న విమాన ప్రయాణాలను పూర్తిగా బంద్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కరోనా వ్యాప్తి కాస్త కంట్రోల్లోకి రావడంతో గత ఏడాది మే 25 నుంచి 33 శాతం కెపాసిటీతో విమానాలను నడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ సమాయానికి 80 శాతం సీటింగ్తో నడిపించే అవకాశం ఇచ్చారు. అయితే మళ్లీ ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో జూన్ 1 నుంచి 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడపాలని ఎయిర్లైన్స్ సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ తర్వాత క్రమంగా ఆ తర్వాత జులై 5 నుంచి 65 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అవకాశం ఇచ్చింది.ఆగస్ట్ 12 నుంచి 72.5 శాతానికి పెంచారు. సెకండ్ వేవ్ కంట్రోల్లోకి వచ్చాక 85 శాతం సీటింగ్ కెపాసిటీకి కేంద్రం అనుమతించింది. ఇవాళ 100 శాతం సీటింగ్ను అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.