మోహన్‌ బాబు బూతులు తిట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ

మోహన్‌ బాబు బూతులు తిట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఓటమిపాలైన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. తన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లంతా కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు బెనర్జీ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

‘‘నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబు నన్ను కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. అమ్మనా బూతులు తిట్టారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుకి వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. చిన్నప్పుడు మంచు లక్ష్మీని, విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి ‘సారీ అంకుల్‌ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు’ అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది’’ అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.