టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు దూరమయ్యాడు. సెలెక్టర్లు అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను జట్టులోకి తీసుకున్నారు. వడోదరలో కివీస్తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ పక్కటెముకల కండరాల గాయానికి గురయ్యాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా.. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్తాడని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ప్రకటించారు. అయితే సుందర్ స్థానంలో ఇప్పుడు స్పెషలిస్ట్ స్పిన్నర్ ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
స్వదేశంలో వరల్డ్ కప్ జరగడంతో టీమిండియాకు స్పిన్ ఆల్ రౌండర్ కంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఎక్కువగా ఉంది. పైగా సుందర్ ను రీప్లేస్ చేసే స్పిన్ ఆల్ రౌండట జట్టులో లేడు. కృనాల్ పాండ్య అంతర్జాతీయర్ క్రికెట్ ఆడి నాలుగు సంవత్సరాలు దాటింది. నేరుగా వరల్డ్ కప్ కు తీసుకొని వచ్చి ఆడించడం రిస్క్ అవుతోంది. మరోవైపు రియాన్ పరాగ్ రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ యువ క్రికెటర్ పూర్తి ఫిట్ నెస్ తో లేడని తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. స్వదేశంలో స్పిన్ ట్రాక్స్ ఉండడంతో సెలక్టర్లు బిష్ణోయ్ వైపే మొగ్గు చూపారు.
తొలి వన్డే ఆడుతూ సుందర్ కు గాయం:
ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సుందర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మ్యాచ్ తర్వాత సుందర్ కు ఎడమ పక్కటెముకలు గాయం అయినట్టు తేలింది. సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ ఉందని మ్యాచ్ తర్వాత స్కాన్ కోసం వెళ్తాడని మ్యాచ్ తర్వాత కెప్టెన్ గిల్ తెలిపాడు.
ఈ టూర్ లో టీమిండియా ప్లేయర్లకు గాయాల బెడద కొనసాగుతూనే ఉంది. తొలి వన్డేకు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అంతకముందు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గజ్జల్లో గాయం కారణంగా కివీస్ తో జరగబోయే తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు.
