- దేశ అవసరాలను తీర్చడానికే
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రిస్ట్రిక్షన్లు మరి కొంత కాలం పాటు కొనసాగనున్నాయి. దేశ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా మార్చి 31తో ముగియాల్సిన రిస్ట్రిక్షన్లను పొడిగించింది. ఎప్పటి వరకు అనేది చెప్పలేదు. రిస్ట్రిక్షన్లలో భాగంగా, కంపెనీలు తమ పెట్రోల్ ఎగుమతుల్లో 50 శాతాన్ని, డీజిల్ ఎగుమతుల్లో 30 శాతాన్ని డొమెస్టిక్ మార్కెట్లో కచ్చితంగా అమ్మాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిఫైన్డ్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్పై ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ను కూడా వేస్తోంది. విండ్ఫాల్ ట్యాక్స్ను ప్రతి 15 రోజులకొకసారి రివ్యూ చేస్తున్నారు. కిందటి నెల 4 నుంచి డీజిల్ ఎగుమతులపై లీటర్కు 50 పైసలు విధిస్తున్నారు. జెట్ ఫ్యూయల్పై విండ్ఫాల్ ట్యాక్స్ వేయడం లేదు. మరోవైపు ఇండియాలో ఉత్పత్తయిన క్రూడాయిల్పై వేస్తున్న సుంకాన్ని కొద్దిగా పెంచారు.
ప్రైవేట్ కంపెనీలకు నష్టమే..
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రిస్ట్రిక్షన్లను మరి కొంత కాలం కొనసాగించడం కొన్ని కంపెనీలపై నెగెటివ్ ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి క్రూడాయిల్ను కొని, రిఫైన్ చేయడం తగ్గుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం వలన రష్యా నుంచి రిఫైన్డ్ ఫ్యూయల్ను యూరోపియన్ దేశాలు కొనడం తగ్గించేశాయి. దీంతో ఇండియాలోని రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడాయిల్ దిగుమతి చేసుకొని, రిఫైన్డ్ ఫ్యూయల్స్ను యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తూ లాభపడుతున్నాయి.