హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారని, దీనిపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరోసారి వాయిదా పడింది. దీనిపై స్పందించేందుకు మరికొంత టైమ్ కావాలని కేంద్రం కోరడంతో సుప్రీంకోర్టు కేసు విచారణను ఏప్రిల్10వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ జేబీ పార్థీవాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.
గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత, తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత్దవే వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ఆమోదించిన బిల్లులను 2022 సెప్టెంబర్లో గవర్నర్ ఆమోదం కోసం పంపారని, అప్పటి నుంచి గవర్నర్ వాటిని ఆమోదించకుండా పెండింగ్లో ఉంచారని దవే వివరించారు. మధ్యప్రదేశ్అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అక్కడి గవర్నర్ ఏడు రోజుల్లో, గుజరాత్అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నెల రోజుల్లో ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించారని తెలిపారు. కానీ తెలంగాణ గవర్నర్ మాత్రం నెలల తరబడి బిల్లులను ఆమోదించకుండా తనవద్దే పెట్టుకున్నారని తెలిపారు. గవర్నర్ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని, ఈ విషయంలో సొలిసిటర్జనరల్ జోక్యం చేసుకోవాలని, గవర్నర్కు సలహాలు ఇవ్వాలని చెప్పారు.
ధర్మాసనం జోక్యం చేసుకొని బిల్లుల ఆమోదంపై గవర్నర్తో చర్చించారా అని సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. తుషార్మెహత స్పందిస్తూ పెండింగ్ బిల్లుల అంశంపై ఇప్పటికే తాను తెలంగాణ గవర్నర్తో చర్చించానని తెలిపారు. గవర్నర్ తో చర్చించిన అంశాలపై ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేనన్నారు. ఈ నెల 20న ఇదే పిటిషన్పై విచారించిన ధర్మాసనం తాము గవర్నర్ కు నోటీసులు జారీ చేయలేమని, పెండింగ్ బిల్లులపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై కేంద్రం స్పందించేందుకు మరికొంత సమయం కావాలని అడ్వొకేట్లు కోరడంతో తదుపరి విచారణను ఏప్రిల్10వ తేదీకి వాయిదా వేశారు.