
- ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు
- ప్రభుత్వం తరఫున వెయ్యిస్తంభాల గుడిలో షురూ
- రానున్న మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క
- వెయ్యిస్తంభాల గుడిలో ఆటపాటలకు 35 ఏండ్లు
వరంగల్, వెలుగు: తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు వేదికైంది. హనుమకొండ సిటీలోని వెయ్యిస్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభంకానున్నాయి. గతంలో ప్రధానంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, తొలిసారి రాష్ట్ర సర్కారు పూర్తిస్థాయిలో టూరిజంశాఖ ఆధ్వర్యంలో సంబురాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు కేరాఫ్గా భావించే ఓరుగల్లు నుంచి మొదలయ్యే సంబురాలను ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు వివిధ జిల్లాల్లో నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. ఆదివారం ఓరుగల్లులో మొదలయ్యే వేడుకలు ఈనెల 30న హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ముగియనున్నాయి.
2006 నుంచి ఓరుగల్లులో ప్రభుత్వ ఏర్పాట్లు..
బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు కేంద్రంగా ఉండగా, 1990 నుంచే వెయ్యిస్తంభాల గుడిలో నిర్వహించే వేడుకల కోసం ఏటా వస్తున్న మహిళలతో ఆలయ ఆవరణ కిక్కిరిసిపోతుంది. రుద్రేశ్వరదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, చండీ యాగం నిర్వహిస్తారు. 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా వెయ్యిస్తంభాల గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో బతుకమ్మ ఆటాడుకునేలా సౌకర్యాలు కల్పించాలన్న భక్తుల విన్నపానికి ఆయన సానుకూలంగా స్పందించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
నాటి నుంచి ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ, ఇతర శాఖల సమన్వయంతో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ప్రారంభమైంది. ఆపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడినుంచే వేడుకలు ప్రారంభించే అనవాయితీ నడుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ సంబురాలను అధికారికంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించాలనే నిర్ణయంతో మరోసారి వెయ్యిస్తంభాలగుడిలో పూర్తిస్థాయిలో టూరిజంశాఖ తరఫున వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పోలీస్ చర్యలు లేకుంటే ఇబ్బందులే..
ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఏటా వెయ్యిస్తంభాల గుడిలో ప్రారంభం అవుతుండగా, ఏటేటా మహిళలతో పాటు కొత్తగా వచ్చే యువతులతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. ఆలయంలో ప్రధాన గుడి, నంది విగ్రహం, కల్యాణ మంటపం, కోనేరులకే ఎక్కువ స్థలం ఆక్రమించింది. ప్రస్తుతం ఇదే స్థలంలో పెద్ద స్టేజీ వేసి వేడుకలకు ఏర్పాట్లు చేయడంతో బతుకమ్మ ఆట స్థలం మరింత తగ్గింది. గతంలో మహిళలు ఆడిపాడే ఏరియాల్లోకి పురుషులను వెళ్లకుండా పోలీసులు కట్టడి చేసేవారు.
ప్రస్తుతం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్టారావు, కొండా సురేఖ, ధనసరి సీతక్కతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యే సమయంలో వారివెంట వచ్చే సెక్యూరిటీ, ఇతర నాయకులు, కార్యకర్తలను ఒకవేళ అనుమతిస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాలకులు, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది.