మనవరాలితో కలిసి డిగ్రీ చదివిండు

మనవరాలితో కలిసి డిగ్రీ చదివిండు

చదువు మీద ఇంట్రెస్ట్​ ఉండాలే కానీ, ఎనభై ఏండ్ల వయసులోనూ డిగ్రీ పాస్​​ కావొచ్చని నిరూపించాడు ఈయన. అమెరికాలోని టెక్సాస్​లో ఉండే  రెనే నీరకి 87 ఏండ్లు. ఈమధ్యే   మనవరాలు మెలనీ సలజార్​తో కలిసి డిగ్రీ పట్టా అందుకున్నాడు.  నీరకి కాలేజీ రోజుల్లోనే   పెండ్లి కావడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. కొన్నేండ్ల కిందట అతని భార్య చనిపోయింది. ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. మధ్యలో ఆపేసిన కాలేజీ చదువుని కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. మనవరాలితో కలిసి 2016లో సాన్​ ఆంటోనియో కాలేజ్​ ఆఫ్​ లిబరల్​ అండ్​ ఫైన్​ ఆర్ట్స్​కాలేజీలో చేరాడు. అప్పటికి ఆయన వయసు 82 ఏండ్లు. ముసలితనంలోనూ ఇష్టంగా పుస్తకాలు తిరగేసి, ఈమధ్యే బిఏ ఎకనామిక్స్​ పాస్​ అయ్యాడు. అతని మనవరాలు మెలనీ మాస్​కమ్యూనికేషన్​లో బిఏ డిగ్రీ అందుకుంది. తాతతో కలిసి ఒకేసారి బ్యాచిలర్​ డిగ్రీ అందుకున్న క్షణం సంతోషంతో ఎగిరి గంతేసింది మెలనీ. కాన్వొకేషన్​ నాడు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వీల్​ఛెయిర్​లో వచ్చి పట్టా తీసుకున్నాడు ఈ పెద్దాయన. తాత, మనవరాలు డిగ్రీ పట్టా పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న  ఫొటోల్ని ఫేస్​బుక్​, ట్విట్టర్​లో పెట్టారు యూనివర్సిటీ వాళ్లు. ఆ ఫొటోలు చూసినవాళ్లు ‘వావ్​... అద్భుతం. ఇద్దరికీ కంగ్రాట్స్’​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.