
చెన్నై: ఇండియా చెస్ స్టార్స్ ఎరిగైసి అర్జున్, విదిత్ సంతోష్ గుజరాతీతో పాటు అనీష్ గిరి వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు మూడో ఎడిషన్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలవనున్నారు. ఆగస్టు 6 నుంచి చెన్నైలో జరిగే ఈ ప్రతిష్టాత్మక క్లాసికల్ టోర్నమెంట్లో మాస్టర్స్, చాంలెంజర్స్ విభాగాల్లో మొత్తం 20 మంది ప్లేయర్లు బరిలో ఉంటారు.
మొత్తం రూ. కోటి ప్రైజ్మనీ ఉన్న ఈ ఈవెంట్లో సత్తా చాటిన వారు 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడానికి అవసరమైన ఫిడే సర్క్యూట్ పాయింట్లు అందుకుంటారు. అర్జున్, విదిత్, గిరితో పాటు జోర్డెన్ వాన్ ఫోరెస్ట్, లియాంగ్ అవాండర్, విన్సెంట్ కీమర్, రే రాబ్సన్, వ్లాదిమిర్ ఫెడోసీవ్, 2024 చాంలెంజర్స్ విన్నర్ వి. ప్రణవ్ మాస్టర్స్ విభాగంలో పోటీలో ఉన్నారు.
గతేడాది ప్రవేశపెట్టిన చాలెంజర్స్ సెక్షన్లో కార్తికేయన్ మురళి, లియోన్ మెండొంకా, ఆర్.వైశాలి, ద్రోణవల్లి హారిక, అభిమన్యు పురాణిక్, ఆర్యన్ చోప్రా, అధిబన్ భాస్కరన్, పి. ఇనియన్ తదితర యంగ్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మాస్టర్స్ విన్నర్కు రూ. 25 లక్షలు, రన్నరప్ ప్లేయర్కు రూ. 15 లక్షలు, థర్డ్ ప్లేస్కు రూ. 10 లక్షల ప్రైజ్మనీ లభిస్తుంది. చాలెంజర్స్ సెక్షన్ విజేతకు రూ. 7 లక్షల నగదు బహుమతి ఉంటుంది.