మధ్యధార సముద్రంలో వందల సంఖ్యలో పౌరుల మరణానికి దారి తీసిన గ్రీస్ పడవ దుర్ఘటన వెనక ఉన్న మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఈ కమిటీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే ఇందుకు కారణమైన 10 మంది సబ్ఏజెంట్లను పాక్లోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా పాక్లో జాతీయ జెండాను అర్ధస్తంభంపై ఎగరేశారు. ప్రపంచ దేశాలు ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపాయి.
గ్రీస్ సమీపంలోని మెస్సెనియాపైలోస్ తీరంలో నాలుగు రోజుల క్రితం బోట్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 79 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గల్లంతై ఉంటారని ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఆ పడవలో 15 మంది సిబ్బందితో పాటు 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారు వెల్లడించారు. ప్రాణాలతో బయట పడ్డ వారు మాట్లాడుతూ.. ' పడవలో చాలా మంది ఉన్నారు. మూడో రోజు అకస్మాత్తుగా అందులోకి నీళ్లు రావడంతో జనమంతా కంగారుపడి రెండో వైపుకు కదిలారు. దీంతో క్షణాల్లో పడవ నీట మునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేవరకు మేం స్పృహలో లేము' అని అన్నారు. డ్రోన్లు, బోట్ల సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నామని గ్రీస్ కోస్ట్అధికారులు చెబుతున్నారు.