గ్రీస్​ పడవ ప్రమాదం.. హైలెవల్​ కమిటీ వేసిన పాకిస్థాన్​

గ్రీస్​ పడవ ప్రమాదం.. హైలెవల్​ కమిటీ వేసిన పాకిస్థాన్​

మధ్యధార సముద్రంలో వందల సంఖ్యలో పౌరుల మరణానికి దారి తీసిన గ్రీస్​ పడవ దుర్ఘటన వెనక ఉన్న మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్​ ప్రధాని షెహబాబ్​ షరీఫ్​ ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఈ కమిటీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే ఇందుకు కారణమైన 10 మంది సబ్​ఏజెంట్లను పాక్​లోని పలు ప్రాంతాల్లో అరెస్ట్​ చేశారు.  పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి  సంతాపంగా పాక్​లో జాతీయ జెండాను అర్ధస్తంభంపై ఎగరేశారు.  ప్రపంచ దేశాలు ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపాయి. 

గ్రీస్​ సమీపంలోని మెస్సెనియాపైలోస్​ తీరంలో నాలుగు రోజుల క్రితం బోట్​ యాక్సిడెంట్​ జరిగింది. ఈ ప్రమాదంలో 79 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గల్లంతై ఉంటారని ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఆ పడవలో 15 మంది సిబ్బందితో పాటు 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారు వెల్లడించారు. ప్రాణాలతో బయట పడ్డ వారు మాట్లాడుతూ.. ' పడవలో చాలా మంది ఉన్నారు. మూడో రోజు అకస్మాత్తుగా అందులోకి నీళ్లు రావడంతో జనమంతా కంగారుపడి రెండో వైపుకు కదిలారు. దీంతో క్షణాల్లో పడవ నీట మునిగింది. గ్రీస్​ కోస్ట్ గార్డ్​ బృందం వచ్చి కాపాడేవరకు మేం స్పృహలో లేము' అని అన్నారు.  డ్రోన్లు, బోట్ల సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నామని గ్రీస్​ కోస్ట్​అధికారులు చెబుతున్నారు.