గ్రీస్ దేశంలో జనాభా సంక్షోభం : రోజూ ఒకరు పుడుతుంటే.. ఇద్దరు చనిపోతున్నారు

గ్రీస్ దేశంలో జనాభా సంక్షోభం : రోజూ ఒకరు పుడుతుంటే.. ఇద్దరు చనిపోతున్నారు

ప్రపంచంలో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి దేశం ఏంటో తెలుసా.. గ్రీస్.. అవును ఆ దేశంలో ఇప్పుడు వేగంగా జనం తగ్గిపోతున్నారు. 2050 నాటికి ఇప్పుడు ఉన్న జనాభా కంటే అక్షరాల 10 లక్షల మంది తగ్గిపోనున్నారు. ప్రస్తుతం గ్రీస్ దేశం జనాభా ఒక కోటి 4 లక్షల మంది.. 2011లో అయితే కోటి 11 లక్షల మందిగా ఉన్నారు. అంటే గత పదేళ్లలోనే 7 లక్షల మంది తగ్గిపోయారు. దీంతో జనాభా సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న మొదటి దేశంగా గ్రీస్ వార్తల్లోకి వచ్చింది. 

ప్రస్తుతం గ్రీస్ దేశంలో ప్రతి రోజు ఒకరు పుడుతుంటే.. ఇద్దరు చనిపోతున్నారు. కరోనా తర్వాత మరణాల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువత, మధ్య వయస్సు ఉన్న వారి మరణాలు పెరగటం గ్రీస్ దేశాన్ని ఆందోళన కలిగిస్తుంది. గుండెపోట్లు, పక్షవాతం, రక్తం గడ్డకట్టి చనిపోవటం, క్యాన్సర్ వంటి వ్యాధులతో మరణాల సంఖ్య పెరగటంతో.. గ్రీస్ దేశంలోనే జనాభా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిందని ఆ దేశ ఆర్థిక మంత్రి కోస్టిస్ ప్రకటించారు. గ్రీస్ దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ప్రధానమైనది జనాభా తగ్గిపోవటం అని చెప్పారంటే.. ఏ స్థాయిలో ఇది ప్రభావం చూపిస్తుందో అర్థం అవుతుంది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో ఏకంగా జననాల రేటు 30 శాతం తగ్గిపోయిందని వెల్లడించారాయన. 

జనం తగ్గితే సంక్షోభం ఏంటీ.. :

దేశంలో జనాభా తగ్గిపోతే వచ్చే సమస్యలు ఏంటీ అంటారా.. జనం తగ్గితే అదే స్థాయిలో పని చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.. దీనికితోడు ప్రజలకు మౌలిక వసతులు కల్పించటానికి ఉన్న జనంపైనే అధిక పన్నులు వేయాల్సి ఉంటుంది.. దేశంలో జనాభా లేకపోతే మౌలిక వసతుల విస్తరణ ఉండదు.. కొత్తగా చేయాల్సి పనులు ఉండవు.. ఇదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి ఆదాయం గణనీయంగా పడిపోతుంది.. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.. ప్రభుత్వానికి ఇదంతా భారంగా మారుతుంది. 

జనం లేకపోతే రవాణా ఉండదు.. జనం లేకపోతే హోటల్స్ ఉండవు.. జనం లేకపోతే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి.. వ్యవసాయం పడిపోతుంది.. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.. దీంతో గ్రీస్ దేశమే కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన గ్రీస్ దేశం.. ప్రజల్లో పిల్లలపై అవగాహన కల్పిస్తుంది.. పిల్లలను కంటే ఆఫర్స్ ఇస్తుంది.. అయినా గ్రీస్ యువత పెళ్లి, పిల్లలపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదు.. గత పదేళ్ల లెక్కలు తీస్తే.. ప్రతి సంవత్సరం సరాసరి 84 వేల మంది పిల్లలు మాత్రమే పెట్టారు.. ఇదే సమయంలో ఏడాదికి లక్షా 50 వేల మందిపైనే చనిపోతూ ఉన్నారు.. 

గ్రీస్ దేశం జనాభా సంక్షోభాన్ని అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశంగా ఉంది. యూరప్ దేశాలు అన్నింటిలోనూ ఈ సమస్య ఉన్నా.. గ్రీస్ లో దాని ప్రభావం అధికంగా ఉంది. 2050 నాటికి గ్రీస్ జనాభా 90 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.. ప్రస్తుతం కోటి 4 లక్షల మంది  మాత్రమే..