
హైదరాబాద్, వెలుగు: పునరుత్పాదక శక్తి తెలంగాణ ఆర్థికాభివృద్ధికే కాదని, అది రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ, సమాజ శ్రేయస్సును కాపాడుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. లండన్లో జరుగుతున్న క్లైమెట్ యాక్షన్ వీక్లో పాల్గొన్న చామల.. బుధవారం అక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ తరఫున మాట్లాడారు. లండన్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయంటే.. అది ముమ్మాటికి మనిషి చేస్తున్న ప్రకృతి వినాశనమేనన్నారు.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ 2030 తీసుకొచ్చామని, అప్పటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల పునరుత్పత్తి సాధిస్తామని చెప్పారు. నీటి వనరులను ఉపయోగించుకుంటూ ఉద్యోగాలను సృష్టించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై రేవంత్ రెడ్డి సర్కార్ 100 శాతం ఫ్రీ ట్యాక్స్ అమలు చేయడంతో పునరుత్పాదక శక్తి పెరుగుతోందని ఆయన వివరించారు.