సినిమా, టీవీ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్

సినిమా, టీవీ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో సినిమా, టీవీ  షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి సీఎం అనుమతిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, ఇప్పటికే షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వెంటనే నిర్వహించుకోవచ్చని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసి సినిమా, టీవీ షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించి విడుదల చేశారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి సీఎం కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పట్లో సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.