కోదండరాంను కలిసిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధితులు

కోదండరాంను కలిసిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధితులు

పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధితులు ఆదివారం హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంను కలిశారు. పంట పొలాలను హైవే కోసం కేంద్రం లాగేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లాలో గతంలో ఉన్న రోడ్లను అనుసంధానం చేస్తూ హైవే వేయాలని కోరారు. హైవే కారణంగా నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల భూములు పోతున్నాయని, ఇలాంటి భూములు మళ్లీ దొరికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

తమ సమస్యలను గతంలో పలుమార్లు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ, ఇతర మంత్రులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా స్పందించి తమ భూములు పోకుండా చూడాలన్నారు. కోదండరాంను కలిసిన వారిలో బూర్గుల రామచందర్రావు, బాధిత రైతులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

జనగామ అర్బన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్‌ లెక్చరర్లు ఎమ్మెల్సీ కోదండరాంకు వినతిపత్రం అందజేశారు. తమ పీఆర్‌సీ ఏరియర్స్‌, వేతన చెల్లింపులు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో స్పందించిన కోదండరాం ఈ విషయంపై ఇప్పటికే సీఎంతో మాట్లాడానని, మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కోదండరాంను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కృష్ణ, అడ్వకేట్‌ సాదిఖ్‌ అలీ, సోమ నరసింహాచారి, కవి సోమేశ్వరచారి, సాయి కిరణ్‌ పాల్గొన్నారు.