CCMBలో క‌రోనా టెస్టుల‌కు కేంద్రం అనుమ‌తి

CCMBలో క‌రోనా టెస్టుల‌కు కేంద్రం అనుమ‌తి

హైద‌రాబాద్‌: తార్నాక‌లోని సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ( CCMB)లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. మార్చి-31 నుంచి CCMBలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం CCMBలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి CCMBలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరిన విష‌యం తెలిసిందే.

ముఖ్య‌మంత్రి రిక్వెస్ట్ మేర‌కు సోమ‌వారం అనుమ‌తులు ఇస్తున్న‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించింది. కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి CCMBకి ఆదేశాలు జారీ అయ్యాయి. మంగ‌ళ‌వారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది CCMB. గాంధీ హాస్పిట‌ల్ నుంచి CCMBకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో CCMB సిద్ధమైందని తెలుస్తోంది.

దేశంలోనే అత్యంత పార‌ద‌ర్శ‌క‌మైన‌ పరిశోధనా సంస్థలో కరోనా పరీక్షలు జరిపితే.. తాత్కాలిక ఉపయోగంతోపాటు పరిశోధనల దిశగా దీర్ఘకాలికంగా ఎంతో ప్ర‌యోజ‌నంగా వుంటుందంటున్నారు వైద్య నిపుణులు. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రికి వివరించడంతో.. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర మెడికల్ రీసెర్చ్ సంస్థ CCMBలో పరీక్షలకు, పరిశోధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.