వనపర్తి మార్కెట్ లో పల్లి రేటు ఢమాల్

వనపర్తి మార్కెట్ లో పల్లి రేటు ఢమాల్
  • వనపర్తి మార్కెట్​లో మూడు రోజుల కింద రూ.12,667  రికార్డు ధర
  • ఆదివారం గరిష్ట ధర రూ.9,790
  • నార్త్  ఇండియా మార్కెట్లోకి పల్లి రావడమే కారణం

వనపర్తి, వెలుగు: వనపర్తి మార్కెట్​లో వేరుశనగ ధర అమాంతం పడిపోయింది. గత నెల 28న క్వింటాల్​ రూ.12,667 ధర పలకగా, ఆదివారం రూ.9,790కు పడిపోయింది. నాలుగు రోజులుగా వేరుశనగ ధర తగ్గుతూ వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్​కు ఏకంగా రూ.2877 తక్కువ రేట్​ రావడంతో అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్​ మార్కెట్లోకి దిగుబడి రావడంతోనే..

వనపర్తి జిల్లాలో పండించే పల్లీకి అఫ్లాటాక్సిన్​ అనే శిలీంద్రం లేకపోవడంతో ఇక్కడి వేరుశనగను విదేశాలకు ఎగుమతి చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పంటను కొనేందుకు పోటీ పడుతుంటారు. అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా గుజరాత్​లోని మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లలో వేరుశనగ దిగుబడి వస్తుండడంతో ఇక్కడి పల్లీకి డిమాండ్​ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. 

కేంద్రం వేరుశనగ కనీస మద్దతు ధరను రూ.7263గా ప్రకటించగా, గత నెల 22 నుంచి వనపర్తి మార్కెట్​లో వేరుశనగకు ధర పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, కమీషన్​ ఏజెంట్లు తమకు తెలిసిన రైతులతో మాట్లాడి మార్కెట్​కు పంట తెప్పించారు.

విదేశాలకు ఎగుమతితో డిమాండ్..

అబ్రాడ్​లో వేరుశనగతో పాలు, నూనె, కేక్​ వంటి బై ప్రాడక్టులతో పాటు పలు తినుబండారాలను తయారు చేస్తున్నారు. అఫ్లాటాక్సిన్​ వంటి శిలీంద్రం లేని పల్లీకి మంచి రేట్​ పెట్టి కొనుగోలు చేస్తుండడంతో వనపర్తిలో పండే వేరుశనగను మంచి రేట్​ పలుకుతోంది. ఇదే ఇక్కడి వ్యాపారులకు వరంగా మారుతోంది. రైతుల నుంచి సరుకు తెప్పించేందుకు ధరను పెంచేసి, ఆ తరువాత వివిధ కారణాలు చూపుతూ తక్కువ ధరకు కొంటున్నారనే విమర్శలున్నాయి.

జనవరిలో 25,587 క్వింటాళ్లు కొనుగోలు..

వనపర్తి వ్యవసాయ మార్కెట్​కు జనవరిలో 25,587 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. వీటిలో అత్యధిక ధర రూ.12,667 కాగా, గత నెల 21న క్వింటాల్​కు రూ.4,600 అత్యల్ప ధర పలికింది. మార్కెట్​ యార్డ్ కు వచ్చిన వేరుశనగ రకాన్ని బట్టి వ్యాపారులు ధరలు పెట్టేలా చూస్తున్నామని మార్కెట్​ అధికారులు చెబుతున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని చెబుతున్నారు.