
- ముందుగా ఏఈ, ఏఈఈ పరీక్షలకు అమలు
- డీఏవో, గ్రూప్స్ మాత్రం ఆఫ్లైన్లోనే నిర్వహణ
- వాయిదా పడ్డ పరీక్షలన్నీ మే, జూన్లోనే
- టీఎస్పీఎస్సీ నిర్ణయం.. ఇవాళో, రేపో అధికారిక ప్రకటన
- హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్.. జూన్ 17న పరీక్ష
హైదరాబాద్, వెలుగు: ఇకపై మెజారిటీ రిక్రూట్మెంట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. గ్రూప్స్, డీఏవో మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లోనే జరపనున్నది. ప్రస్తుతం రద్దయిన, వాయిదా పడ్డ పరీక్షలను మే, జూన్ లో నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నది.
లక్ష అప్లికేషన్లు దాటితే ఆఫ్లైన్!
గతేడాది 17 వేలకుపైగా పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు ఏడు పరీక్షలు నిర్వహించింది. అయితే, క్వశ్చన్ పేపర్ లీక్ తో వీటిలో నాలుగు
పరీక్షలను రద్దు చేసింది. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్లో జరగాల్సిన మరో 4పరీక్షలను వాయిదా వేయనున్నది. మార్చి 5న ఆఫ్లైన్లో జరిగిన ఏఈ పరీక్ష, జనవరి 22న ఆఫ్లైన్లో జరిగిన ఏఈఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్ మెంట్లకు ఒక్కొక్కరికీ ఒక్కోరోజు చొప్పున మూడ్రోజుల పాటు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చి, రద్దయిన డీఏవో ఎగ్జామ్ను, టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ను ఆఫ్ లైన్లో పెట్టాలని భావిస్తున్నారు. వెటర్నరీ సర్జన్ ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలను వాయిదా వేసి, ఆన్లైన్లోనే పెట్టనున్నారు. గ్రౌండ్ వాటర్లో పరీక్షను రెండ్రోజులు పెట్టే యోచనలో ఉన్నారు. లైబ్రరియన్, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలనూ ఆన్ లైన్లోనే నిర్వహించనున్నారు.
గ్రూప్స్1 ప్రిలిమ్స్ జూన్ 11నే
గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు కావడంతో, జూన్ 11 నిర్వహిస్తామని అధికారులు గతంలోనే రీషెడ్యూల్ ఇచ్చారు. ఈ పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం అభ్యర్థుల్లో ఉంది. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు, జులై 1న గ్రూప్ 4 పరీక్షనూ యథావిధిగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. అయితే, పరీక్షపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.
హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్
ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను జూన్ 17న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.