హైదరాబాద్‌లో కోడి పందేలకు పెరుగుతున్న క్రేజ్‌

హైదరాబాద్‌లో కోడి పందేలకు పెరుగుతున్న క్రేజ్‌

హైదరాబాద్, వెలుగు: కోడి పందేలు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్​లో ఏటా క్రేజ్ పెరుగుతోంది. కోళ్ల పందేనికి గుట్టు చప్పుడు కాకుండా 3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలోని చాలా ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ కోడి పందేలకు క్రేజ్ ఏర్పడింది. దీంతో పందెం కోళ్లకు డిమాండ్ ఏర్పడింది. సిటీ శివారు ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచి అమ్ముతున్నారు. వీటి కోసం ఫాం హౌస్​లు, పౌల్ట్రీ ఫామ్‌లలో ఏర్పాట్లు చేసిన షెడ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందినోళ్లు కోళ్లను కొంటున్నారని పందెం కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. మొయినాబాద్, రాజేంద్ర నగర్, అబ్దుల్లాపూర్ మెట్, శామీర్ పేట్, కీసర, ఇబ్రహీంపట్నం, బార్కస్ తదితర ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచి, వాటికి ట్రైనింగ్ ఇచ్చి అమ్ముతున్నారు. కోడిని బట్టి రూ.30 వేల నుంచి లక్షకుపైగా ధరలు ఉంటున్నాయి. 

ఆన్ లైన్ లోనూ పందేలు

ఆన్​లైన్​లోనూ కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. ఇందుకు పలు యాప్‌లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. కోడి పందేలను ఆన్​లైన్​లో చూస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీలో జరుగుతున్న కోడి పందేలకూ ఆన్ లైన్ లో సిటీ నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్స్ లో పాల్గొంటున్నారు.

నాటుకోళ్లకూ పెరిగిన డిమాండ్

సిటీలో నాటుకోళ్లకూ డిమాండ్​ పెరిగింది. బోనాలు, దసరా, సంక్రాంతి తదితర పండుగలకు బాయిలర్​ కోళ్ల చికెన్ కాకుండా నాటు కోళ్లను  కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండడంతో పల్లెల నుంచి వచ్చిన కోళ్లు సరిపోకపోవడంతో పౌల్ర్టీల్లో కూడా నాటు కోళ్లను పెంచుతున్నారు. శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో కొందరు ఇంటి వద్దే నాటుకోళ్లు పెంచుతున్నారు.

సిటీ శివారు ప్రాంతాల్లో భారీగా కోళ్ల పందేలు

హైదరాబాద్  సిటీలో ఒకప్పుడు ఒకటి రెండు ప్రాంతాల్లో రహస్యంగా కోడిపందేలు నిర్వహించేవారు. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల పందేలు జరుగుతున్నాయి. వనస్థలిపురం, అబ్దుల్లా పూర్ మెట్, హస్తినాపురం, నాగోల్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, మియాపూర్, పుప్పాలగూడ, పిర్జాదిగూడ, నాగరం, కీసర, అంబర్ పేట్ బతుకమ్మ కుంట తదితర ప్రాంతాల్లో  పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో జరిగే కోడిపందేలకు శివారు ప్రాంతాల్లో పెంచిన పందెం కోళ్లతో పాటు వరంగల్ నుంచీ పందెం కోళ్లను తీసుకొస్తున్నట్లు తెలిసింది.