- నికర జలాలు తరలించేందుకే ఏపీ ప్రాజెక్టు చేపట్టిందని కామెంట్
- నిజానికి బచావత్ అవార్డులో పోతిరెడ్డిపాడుకు కేటాయింపుల్లేవ్
- కొత్త ప్రాజెక్టులెట్ల కడతారని ప్రశ్నిస్తున్న మన ఇంజనీర్లు
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు నికర జలాలు తరలించేందుకే ఏపీ సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం చేపట్టిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తెలిపింది. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ లిఫ్ట్ స్కీంతో నీటిని ఎత్తిపోయవచ్చని స్పష్టం చేసింది. పంపుహౌస్ నిర్మాణ ప్రాంతంలో స్టడీ చేసిన జీఎస్ఐ.. దీనికి సంబంధించి ఏపీ సర్కారుకు ఫీజిబులిటీ రిపోర్టు ఇచ్చింది. ఏపీలోని కర్నూలు జిల్లా సంగమేశ్వరం ఆలయం వద్ద పంపుహౌస్ నిర్మిస్తున్నారని, పంపుహౌస్తో పాటు అప్రోచ్ఛానల్ నిర్మాణ ప్రాంతంలో బోర్లు వేసి సర్వే చేశామని వెల్లడించింది. సంగమేశ్వరం వద్ద 222.72 మీటర్ల పొడవు, 55.25 మీటర్ల వెడల్పుతో పంపుహౌస్ నిర్మిస్తున్నారని, దీని నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొంది. రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించడానికి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని వివరించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై ఆధారపడిన ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులున్నాయని, ఆ కేటాయింపుల మేరకు నీటిని తీసుకోవడానికి ఏపీ ఎత్తిపోతల పథకం చేపట్టిందని తెలిపింది. శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటి మట్టం ఉన్నప్పుడే లిఫ్ట్ స్కీం ఆపరేట్ చేస్తారని పేర్కొంది. ఈ లెక్కన కృష్ణా నదిలో వరద ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్తో నీటిని తరలిస్తామనే వాదన వట్టిదేనని తేలిపోయింది.
ఏపీ చెప్పిన వివరాలతోనే రిపోర్టు
ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఏపీ ఇచ్చిన వివరాలతోనే జీఎస్ఐ ఆఫీసర్లు ఫీజిబులిటీ రిపోర్టు ఇచ్చారని తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ అవార్డు ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు ఎలాంటి కేటాయింపులు లేవని చెప్పారు. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నాయనేది తప్పుడు వాదన అని స్పష్టం చేశారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, అమలులో లేని అవార్డులో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అధికారిక ఖరారు కాకుండా నికర జలాల తరలింపునకు కొత్త ప్రాజెక్టులు ఎలా చేపడుతారని మన ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమలో ఒక్క కర్నూలు జిల్లా మినహా మిగతా మూడు జిల్లాలు, నెల్లూరు పెన్నా బేసిన్లో ఉన్నాయని, బేసిన్ అవసరాలు తీరకుండా బేసిన్ అవతలికి నీటి తరలింపులు చేయవద్దని బచావత్ ట్రిబ్యునల్తేల్చిచెప్పిందని గుర్తు చేశారు. సంగమేశ్వరం పంపుహౌస్లో 12 పంపులతో రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారని జీఎస్ఐ రిపోర్టులో పేర్కొందని తెలిపారు. ఈ పంపుహౌస్ ఆపరేట్ చేసేందుకు 400 మెగావాట్ల కెపాసిటీతో సబ్స్టేషన్, హెచ్టీ కరెంట్ లైన్లు ఏర్పాటు చేయాల్సిఉందని తెలిపారు.