హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాను నాగార్జున ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.
వివాదం ఏంటంటే..?
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్మీడియా లింక్స్తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్ఎస్ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు.
‘‘నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే చింతిస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా’’ అని కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
