తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

గురువారం ( నవంబర్ 13 ) రైస్ మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు.  తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని అన్నారు.పద్మావతి గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి. ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత  ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ... తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

బియ్యం శాంపిల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్న ప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి.రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని... తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

►ALSO READ | పవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి

టీటీడీలో ప్రతిరోజూ తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20 వేల కేజీల బియ్యం వినియోగిస్తున్నారు. 60:40 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా చేస్తున్నారు.ప్రతినెలా రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి. శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెలా అన్న ప్రసాదం నాణ్యతపై సర్వే నిర్వహించాలని... భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

టీటీడీలో కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్: 

రైస్ మిల్లర్ల సమావేశం తర్వాత గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీలో కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌజ్ కార్పోరేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్టీఆర్ఐ సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వపై మరింత మెరుగైన సౌకర్యాలు రూప కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు వెంకయ్య చౌదరి.