
- రాణించిన గిల్, బౌలర్లు
- గైక్వాడ్ మెరుపులు వృథా
అహ్మదాబాద్: నాలుగేండ్ల తర్వాత కలర్ఫుల్ ఓపెనింగ్ సెర్మనీ.. మూడేండ్ల తర్వాత హోమ్ అవే ఫార్మాట్లో ఆట..! వరల్డ్ లార్జెస్ట్ స్టేడియంలో వేలాది ఫ్యాన్స్ కేరింతలు.. మళ్లీ మొదలైన చీర్ గాళ్స్ సందడి నడుమ ఐపీఎల్16కి ఖతర్నాక్ ఆరంభం లభించింది. సొంతగడ్డపై ఆల్రౌండ్ పెర్ఫామెన్స్ చూపెట్టిన డిఫెండింగ్ చాంప్ గుజరాత్ టైటాన్స్ నయా సీజన్ను సూపర్ విక్టరీతో షురూ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది. తొలుత రుతురాజ్ గైక్వాడ్ (50 ఓవర్లలో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92) చెలరేగడంతో సీఎస్కే 20 ఓవర్లలో 178/7 స్కోరు చేసింది. టైటాన్స్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్లో శుభ్మన్ గిల్ (36 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) మెరుపులతో టైటాన్స్ 19.2 ఓవర్లోనే 182/7 స్కోరు చేసి గెలిచింది. చెన్నై డెబ్యూ బౌలర్ రాజ్ వర్దన్ హంగర్గేకర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. రషీద్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రుతురాజ్ సిక్సర్ల మోత
చెన్నై ఇన్నింగ్స్లో యంగ్స్టర్ రుతురాజ్ గైక్వాడ్ హీరోగా నిలిచాడు. పేస్, స్పిన్ అన్న తేడా లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ, చివర్లో టైటాన్స్ బౌలర్లు పుంజుకొని చెన్నై జోరును అడ్డుకున్నారు. టాస్ ఓడిన సీఎస్కేకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్లోనే డెవాన్ కాన్వే (1)ను షమీ బౌల్డ్ చేసి టైటాన్స్కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువ లేదు. గైక్వాడ్కు తోడైన మొయిన్ అలీ(23) ఉన్నంతసేపు చెలరేగిపోయాడు. జోష్ లిటిల్ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ 6, 4తో స్పీడు పెంచగా.. షమీ బౌలింగ్లో అలీ 4, 6, 4తో రెచ్చిపోయాడు. కానీ, ఆరో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ రషీద్ ఖాన్.. అలీని ఔట్ చేయడంతో పవర్ప్లేలో సీఎస్కే 51/2తో నిలిచింది. ఇక, ఫీల్డింగ్ మారిన తర్వాత రుతురాజ్ సిక్సర్ల మోత మొదలైంది. పాండ్యా వేసిన ఏడో ఓవర్లో రెండు బాల్స్ను స్టాండ్స్కు పంపిన అతను.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో మూడు సిక్సర్లతో 23 బాల్స్లోనే ఫిఫ్టీ దాటాడు. మధ్యలో స్టోక్స్ (7)ను రషీద్ ఔట్ చేసినా.. అంబటి రాయుడు (12) జతగా రుతురాజ్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. యష్ దయాల్ వేసిన 12వ ఓవర్లో గైక్వాడ్తో పాటు రాయుడు కూడా సిక్స్తో అలరించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే లిటిల్..ఫుల్ డెలివరీతో రాయుడును క్లీన్ బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్కు 51 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో పుంజుకున్న టైటాన్స్ బౌలర్లు వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ ఇవ్వలేదు. అయితే, రషీద్ వేసిన 17వ ఓవర్లో మరో భారీ సిక్స్ కొట్టిన రతురాజ్ స్కోరు 150 దాటించాడు. గైక్వాడ్ ఊపు చూస్తుంటే తన సెంచరీతో పాటు సీఎస్కే స్కోరు ఈజీగా 200 చేసేలా కనిపించింది. కానీ, 18వ ఓవర్లో గైక్వాడ్, జడేజా (1)ను ఔట్ చేసిన జోసెఫ్ 4 రన్సే ఇచ్చాడు. ఇక, షమీ బౌలింగ్లో సిక్స్ కొట్టిన దూబే (19) తర్వాతి బాల్కే ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్లో ధోనీ ( 14 నాటౌట్) 6,4తో స్కోరు 170 దాటించి ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
గిల్ జిగేల్
భీకర్ ఫామ్లో ఉన్న టీమిండియా యంగ్స్టర్ శుభ్మన్ గిల్కు తోడు మిగతా బ్యాటర్లూ రాణించడంతో టైటాన్స్ ఈజీగానే గెలిచింది. ఛేజింగ్లో జీటీ స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడింది. సీఎస్కే పేసర్ దీపక్ చహర్ తొలి ఓవర్లో మూడు రన్సే ఇవ్వగా.. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ తుషార్ దేశ్పాండే వేసిన రెండో ఓవర్లో సాహా (25) 6,4.. గిల్ ఫోర్తో జోరు పెంచారు. ఆపై, చహర్ బౌలింగ్లో సాహా మరో సిక్స్ కొట్టడంతో స్టేడియం హోరెత్తింది. అయితే, రాజ్వర్దన్ హంగర్గేకర్ బౌలింగ్లో భారీ షాట్కు ట్రై చేసిన సాహా.. దూబేకు క్యాచ్ ఇవ్వడంతో సీఎస్కేకు బ్రేక్ లభించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సాయి సుదర్శన్ (22)తో కలిసి గిల్ తన ఫామ్ చూపెట్టాడు. దేశ్పాండే బౌలింగ్లో గిల్ 4, 6తో దంచడంతో పవర్ప్లేలో జీటీ 65/1 చేసింది. కానీ, పదో ఓవర్లో మళ్లీ రాజ్వర్దన్ షార్ట్ వైడ్ డెలివరీతో సుదర్శన్ను ఔట్ చేసి రెండో వికెట్కు 53 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అయినా జోరు తగ్గని గిల్.. జడేజా బౌలింగ్లో 4, 6తో 11 ఓవర్లకే స్కోరు వంద దాటించాడు. కానీ తర్వాతి ఓవర్లో జడ్డూ.. కెప్టెన్ పాండ్యా (8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక దేశ్పాండే వేసిన 15వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా క్లాసిక్ సిక్సర్ కొట్టిన గిల్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔటవడంతో సీఎస్కే రేసులోకి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో జీటీకి 30 రన్స్ అవసరమైన దశలో హంగర్గేకర్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన విజయ్ శంకర్ (27) ఔటయ్యాడు. దాంతో, టైటాన్స్ విజయ సమీకరణం 12 బాల్స్లో 23 రన్స్గా మారగా ఉత్కంఠ పెరిగింది. అయితే, రషీద్ ఖాన్ (10 నాటౌట్), తెవాటియా (15 నాటౌట్) చెరో సిక్స్, ఫోర్తో టైటాన్స్ను గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 178/7 (రుతురాజ్ 92, అలీ 23, రషీద్ 2/26, షమీ 2/29))
టైటాన్స్: 19.2 ఓవర్లలో 182/5 (గిల్ 63, శంకర్ 27, రాజ్వర్దన్ 3/36).
ఇదీ ఇంపాక్ట్!
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తొలిసారి ఉపయోగించిన టీమ్గా సీఎస్కే నిలిచింది. తమ బ్యాటింగ్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు ప్లేస్లో పేసర్ తుషార్ దేశ్పాండేను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపింది. ఇక, ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కేన్ విలియమ్సన్ ప్లేస్లో టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంచుకుంది. తుషార్ 3.2 ఓవర్లలో ఒకే వికెట్ తీసి51 రన్స్ ఇచ్చుకున్నాడు. సుదర్శన్ 17 బాల్స్ 3 ఫోర్లతో 22 రన్స్ కొట్టాడు. గిల్తో ఫిఫ్టీ జోడించి టైటాన్స్ విక్టరీకి పునాది వేశాడు.