- పార్టీ లీడర్లను గైడ్ చేయండి.. సోనియాగాంధీకి అద్దంకి దయాకర్ లేఖ
- అందరూ ఐక్యంగా ఉండేలా చూడండి
- ఉద్యమకారులు, అమరులకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వండి
- గెలిచాక పార్టీ మారే వారిపై ముందస్తుగానే కఠినంగా ఉండాలి
- నమ్మకంగా ఉండే నేతలకే టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కొందరు నాయకులతో పార్టీ ఐకమత్యం దెబ్బతింటున్నదని, దాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కోరారు. ఈ మేరకు సోమవారం సోనియాగాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను అద్దంకి దయాకర్ రాశారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పునర్వైభవాన్ని సంతరించుకుంది. మళ్లీ అధికారం దిశగా సాగుతున్నది. తెలంగాణ ఇచ్చినందుకు మిమ్మల్ని తెలంగాణ తల్లిగా కొలుస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో పార్టీ పునరుత్తేజానికి సంబంధించి మీరు చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో అన్నివర్గాల వారు అన్యాయానికి గురవుతున్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా అందరికీ మీ దిశానిర్దేశం తప్పనిసరి’’ అని సోనియాను కోరారు.
ఈ అంశాలను యాదిలో పెట్టుకోండి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హైకమాండ్ ఖచ్చితంగా కొన్ని అంశాలను యాదిలో పెట్టుకోవాలని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
1 తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడి, ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు పార్టీ మేనిఫెస్టోలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చేలా మేనిఫెస్టోలో పొందుపరచాలి.
2ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, యాక్టివిస్టులను గుర్తించి అవకాశాలివ్వాలి.
3 గెలిచాక స్వార్థం కోసం పార్టీలు మారే వారిపై, వెన్నుపోటు పొడిచేవారిపై కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది.
4 బీజేపీ, బీఆర్ఎస్ ప్రయోగించే కుటిల వ్యూహాలకు చెక్పెట్టేలా సమర్థమైన వ్యూహాలనూ రూపొందించాల్సిన అవసరం ఉంది.
5 పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న, కష్టపడుతున్న నేతలను గుర్తించి పార్టీలోని కీలక పదవుల్లో చోటు కల్పించాలి.
6 రాజకీయాలంటే సంపాదించుకోవడమేనన్న భావనలో ఉండే నేతలు, అవకాశవాదాన్ని నిరోధించడం ద్వారా తెలంగాణ భవిష్యత్ అవసరాలను కాపాడవచ్చు.
7. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగబద్ధమైన రాజకీయాలను వారికి వివరించాల్సిన అవసరం ఉంది.
8 ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్య నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి.
9 వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రతిపాదించినట్టు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీని చేయాలి. రైతు డిక్లరేషన్ను అమలు చేయాలి.