Vijay: మలేషియాలో 'జన నాయగన్' ఈవెంట్‌కు రికార్డు డిమాండ్.. టికెట్ ధర ఎంతంటే?

Vijay: మలేషియాలో 'జన నాయగన్' ఈవెంట్‌కు రికార్డు డిమాండ్.. టికెట్ ధర ఎంతంటే?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది.  తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలికి, పూర్తిస్థాయి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్న విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం సినిమాగానే కాకుండా.. దాని ఆడియో లాంచ్ వేడుకతోనూ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తమిళ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా.. ఈ ఈవెంట్‌ను ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు నమోదు చేయాలనే లక్ష్యంతో నిర్వాహకులు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు.

మలేషియాలో  గ్రాండ్ గా ఈవెంట్..

మలేషియాలోని భారీ బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం 'జన నాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ స్టేడియం సామర్థ్యం లక్ష మంది వరకు ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు లక్ష మంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ చారిత్రక వేడుక డిసెంబర్ 27 న జరగనుంది. ఈవెంట్‌లో పాల్గొనేందుకు అభిమానులు నవంబర్ 28 నుండి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరను  రూ.2,100 నుండి  రూ. 6,500 వరకు నిర్ణయించారు. 

ఎమోషనల్ ఫేర్‌వెల్‌

ఇది సాధారణ ఆడియో లాంచ్ కాదు. దళపతి విజయ్‌ తన30 ఏళ్ల సినీ ప్రయాణానికి, అభిమానులతో ఏర్పడిన అనుబంధానికి ఘనంగా వీడ్కోలు పలికే వేదికగా నిలవనుంది. ఈ వేడుకలో 10 గంటల ట్రిబ్యూట్ కచేరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎమోషనల్ ఫేర్‌వెల్‌లో విజయ్ తన రాజకీయ ప్రయాణం గురించి కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఆడియో లాంచ్ వేడుకలో పాల్గొనేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టికెట్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది.

మ్యూజిక్ సెన్సేషన్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సినీ ప్రియుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ప్రత్యేక వేడుకలో అనిరుధ్ తన బృందంతో కలిసి ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నాడు.  ఇందులో సాయింధవి , టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమియా, ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర , యోగి బి వంటి ప్రముఖ గాయనీ గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరితో పాటు ఇటీవలే విజయ్ ఏసుదాస్ కూడా ఈ భారీ ప్రదర్శనలో భాగమయ్యారు.

రాజకీయ యాక్షన్ థ్రిల్లర్

'వాలిమై', 'తునివు' వంటి భారీ యాక్షన్ చిత్రాలను అందించిన దర్శకుడు హెచ్. వినోథ్ ఈ 'జన నాయగన్'  సినిమాను తెరకెక్కించారు. వినోథ్ టేకింగ్‌లో విజయ్ యాక్షన్ పీక్స్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మామితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ డియోల్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ 'జన నాయగన్' జనవరి 9న పొంగల్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..