టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. సినిమాల్లో గ్లామర్ పాత్రలతోనే కాకుండా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో నిరంతరం టచ్లో ఉంటుంది.అయితే, లేటెస్ట్ ఈ ముద్దుగుమ్మకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిపై ఈషా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కఠిన నిర్ణయం తీసుకుంది
పోలీసులను ఆశ్రయించిన ఈషా
గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో తాను పెట్టే ఫోటోలు, వీడియోలకు ఒక వ్యక్తి వరుసగా అసభ్యకరమైన, జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నట్లు ఈషా గుర్తించారు. తొలుత వీటిని విస్మరించినప్పటికీ, ఆ వ్యక్తి పరిధి దాటి ప్రవర్తించడంతో తన గౌరవానికి భంగం కలుగుతుందని భావించింది . చిరకుసైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తి ప్రొఫైల్ ఐడితో పాటు, అతను పెట్టిన అభ్యంతరకర కామెంట్లను స్క్రీన్ షాట్స్ తీసి ఆధారాలుగా పోలీసులకు సమర్పించారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
ఈషా ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కావాలనే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్నాలజీ సాయంతో ఆ నిందితుడి ఐపి అడ్రస్ను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
నెటిజన్ల ప్రశంసలు
చాలామంది హీరోయిన్లు ఇలాంటి కామెంట్లను చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. కానీ ఈషా రెబ్బ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మౌనంగా ఉంటే ఇలాంటి వారు మరింత రెచ్చిపోతారు, పోలీసులకు పట్టించడం మంచి పద్ధతి అంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటున్నారు. విభిన్నమైన కథాంశాలతో వెబ్ ఒరిజినల్స్లో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.
