తెలంగాణలోనూ గుజరాత్ సీన్ రిపీట్ : తరుణ్ చుగ్

తెలంగాణలోనూ గుజరాత్ సీన్ రిపీట్ : తరుణ్ చుగ్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ 

ఢిల్లీ : గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తరుణ్ చుగ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా గుజరాత్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పడుతామని తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేవని చెప్పారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి అహంకారం ఎక్కువైందన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయని, ఆశించిన దానికన్నా ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయని తరుణ్ చుగ్ చెప్పారు.